
జనం న్యూస్ జూన్ 30 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి : కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఏఈఆర్వో, డిప్యూటీ కమిషనర్ చాముండేశ్వరి, ఏఎంసీ వాయిద్ అలీతో కలిసి కార్యక్రమం నిర్వహణ తీరును సమీక్షించారు. ఈ సందర్భంగా మాధవరం రంగారావు మాట్లాడుతూ, ఓటరు జాబితా పూర్తిస్థాయిలో పారదర్శకంగా, తప్పుల్లేకుండా రూపొందించేందుకు బీఎల్వోలు (బూత్ లెవల్ ఆఫీసర్లు), రాజకీయ పార్టీల బీఎల్ఏలు (బూత్ లెవల్ ఏజెంట్లు) సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు నమోదు అయ్యేలా విస్తృత అవగాహన కల్పించాలని, ఎవరూ ఓటు హక్కును కోల్పోకుండా చూడాలని కోరారు.అదే విధంగా, మరణించిన వ్యక్తుల పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించడం, ఒకే వ్యక్తికి రెండు లేదా మూడు చోట్ల నమోదైన డూప్లికేట్ ఓట్లను గుర్తించి తొలగించే ప్రక్రియను నిబంధనల ప్రకారం వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేసి, స్వచ్ఛమైన మరియు విశ్వసనీయమైన ఓటరు జాబితా తయారీలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన పిలుపునిచ్చారు.