
జనం న్యూస్ 27 ఆగస్టు వికారాబాద్ జిల్లా :- పరిగి మండలం రాపోలు గ్రామంలో నిర్వహించిన ఎస్ఐఆర్ గ్రామ సభలో ఓటరు జాబితా పరిశీలన, ప్రజల సందేహాల నివృతి, ఓటరు వివరాల ధ్రువీకరణ తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ జాయింట్ సెక్రటరీ గండు వెంకటేష్ మాట్లాడుతూ.. ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో సక్రమంగా ఉండేలా ప్రతి ఒక్కరూ తమ వివరాలను తప్పనిసరిగా పరిశీలించుకోవాలని సూచించారు. ఓటరు జాబితాలో ఏవైనా తప్పులు, మార్పులు లేదా కొత్తగా నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉన్నవారు సంబంధిత అధికారులను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గ్రామస్థులు తమ కుటుంబ సభ్యుల ఓటరు వివరాలను కూడా ఒకసారి పరిశీలించి అవసరమైన సవరణలు చేయించుకోవాలని అవగాహన కల్పించారు. అధికారులు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా ప్రక్రియను నిర్వహించాలని కోరారు. గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సందేహాలను నివృత్తి చేసుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ డైరెక్టర్ పి. నాగవర్ధన్, గ్రామ ఉపాధ్యక్షుడు రాకేష్, వార్డు సభ్యులు రఫీ, సీహెచ్ రాజు, బీఎల్వో గండు బాలమణి, గ్రామ కార్యదర్శి బిచ్చయ్య, ఆర్ఐ దివ్య, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.