
జనం న్యూస్ ప్రతినిధి కందుకూరు, జూన్ 19: రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఘనంగా నిర్వహించ బడ్డాయి. ఈ కార్యక్రమాల్లో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ గంగాపురం కిషన్ రెడ్డి, రాష్ట్ర రోడ్లు & భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి పాల్గొన్నారు.లేమూరు గ్రామంలో రూ.38 కోట్ల అంచనా వ్యయంతో 14 కిలోమీటర్ల మేర నిర్మించనున్న డబుల్ లేన్ రహదారి పనులకు శంకుస్థాపన చేశారు. లేమూరు నుంచి శ్రీశైలం జాతీయ రహదారి మీదుగా తిమ్మాపూర్ వరకు (వయా అగర్మియా గూడ) అను సంధానించే ఈ రహదారి ద్వారా ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.అనంతరం బేగంపేట గ్రామంలో రూ.17 కోట్ల వ్యయంతో చేపట్టనున్న 6.2 కిలోమీటర్ల డబుల్ లేన్ రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. బేగంపేట–ఎలిమినేడు మార్గాన్ని (వయా మాదాపూర్) ఆధునికీకరించడం ద్వారా స్థానిక ప్రజలకు మరింత సౌకర్యవంతమైన రవాణా సదుపాయాలు కల్పించనున్నట్లు తెలిపారు.ఇక తిమ్మాపూర్ గ్రామంలో రూ.30 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన 22 కిలోమీటర్ల ఆర్సీఐ గేట్–మీర్ఖాన్పేట్ ప్రధాన రహదారిని ప్రారంభించారు. రావిర్యాల, కొంగరకలాన్, తిమ్మాపూర్, మాదాపూర్, గుమ్మడవల్లి, ఆకుల మైలారం గ్రామాల మీదుగా వెళ్లే ఈ విశాల రహదారి ద్వారా వేలాది మంది ప్రజలకు మెరుగైన, సురక్షితమైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయని పేర్కొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడిన నేతలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతోనే అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా అమలవుతున్నాయని, ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.ఈ కార్యక్రమంలో రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రాంరెడ్డి, ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
