
జనం న్యూస్ జూన్ 26 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి గండ్రవానిగూడెం గ్రామ పరిధిలో కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా బూత్ లెవల్ ఆఫీసర్ జానకి, వివిధ రాజకీయ పార్టీల బూత్ లెవల్ ఏజెంట్లు తో కలిసి గ్రామంలోని ఓటర్ల నివాసాలకు వెళ్లి ఓటరు నమోదు, సవరణలకు సంబంధించిన దరఖాస్తు ఫారాలను పంపిణీ చేశారు.అర్హులైన ప్రతి ఒక్కరూ తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని, ఇప్పటికే నమోదైన ఓటర్లు తమ వివరాలను ఒకసారి పరిశీలించి అవసరమైతే సవరణలు చేయించుకోవాలని అధికారులు సూచించారు. కొత్తగా 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న యువత ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా బీఎల్వో జానకి మాట్లాడుతూ, ఓటరు జాబితా పారదర్శకంగా, తప్పులులేకుండా ఉండేలా కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఇంటింటికీ వెళ్లి ఫారాల పంపిణీ చేపడుతున్నట్లు తెలిపారు. ప్రజలు అవసరమైన పత్రాలతో ఫారాలను సకాలంలో సమర్పించి తమ ఓటు హక్కును వినియోగించుకునేలా సహకరించాలని ఆమె కోరారు.గ్రామంలో కొనసాగుతున్న ఈ ప్రత్యేక కార్యక్రమానికి రాజకీయ పార్టీల బీఎల్ఏలు సహకారం అందిస్తూ, ఓటర్లకు అవసరమైన సమాచారం అందించారు. దీంతో ఓటరు నమోదు ప్రక్రియ గ్రామంలో సజావుగా కొనసాగుతోంది.