
వన మహోత్సవ కార్యక్రమం
జనం న్యూస్ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం ఆగస్టు 25. 08. 2026 జహీరాబాద్: వన సందర్శిని కార్యక్రమంలో భాగంగా జహీరాబాద్ త్రివేణి వనంలో విద్యాభారతి హైస్కూల్ విద్యార్థులు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతను చాటుకున్నారు. మంగళవారం ఉదయం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్యామ్ సుందర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా స్థానిక ఆర్డీఓ, ఎమ్మార్వో, మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, అటవీ శాఖ సిబ్బంది, విద్యాభారతి హైస్కూల్ ప్రిన్సిపాల్ కృష్ణారెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి త్రివేణి వనంలో వివిధ రకాల మొక్కలను నాటారు. పర్యావరణ పరిరక్షణలో మొక్కల ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించారు. ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి వాటి సంరక్షణకు కృషి చేయాలని సూచించారు.అనంతరం విద్యార్థులు త్రివేణి వనాన్ని సందర్శించి అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదించారు. వనంలోని ఆహ్లాదకరమైన వాతావరణంలో సరదాగా గడిపిన విద్యార్థులు ఆట స్థలంలో వివిధ ఆటలు ఆడి ఆనందాన్ని పంచుకున్నారు. ప్రకృతిని దగ్గరగా చూసే అవకాశం లభించడంతో విద్యార్థుల్లో ఉత్సాహం నెలకొంది.వన సందర్శిని కార్యక్రమం ద్వారా విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై అవగాహనతో పాటు ప్రకృతితో మమేకమయ్యే అవకాశం కలిగిందని విద్యాభారతి హైస్కూల్ ప్రిన్సిపాల్ కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఈ కార్యక్రమం పట్ల ఎంతో సంతోషం వ్యక్తం చేశారని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ ఇలాంటి పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల్లో విద్యార్థులను భాగస్వాములను చేస్తామని తెలిపారు.