
జనం న్యూస్, ఆగస్టు 31, జగిత్యాల జిల్లా, మెట్పల్లి : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్నప్పటికీ, మెట్పల్లి పట్టణం, పరిసర ప్రాంతాల ప్రజలకు మాత్రం ఇంకా కార్డులు అందకపోవడంపై లబ్ధిదారుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.ఇప్పటికే మెట్పల్లి చుట్టుపక్కల గ్రామాలు, పలు మండలాల్లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ జరుగుతున్నట్లు సమాచారం. అయితే మెట్పల్లి ప్రాంతంలో కార్డుల పంపిణీ ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయంపై స్పష్టత లేకపోవడంతో లబ్ధిదారులు అయోమయానికి గురవుతున్నారు. ఇతర ప్రాంతాల్లో కార్డులు అందుతుండగా, తమ వంతు ఎప్పుడు వస్తుందో తెలియక ఎదురుచూడాల్సి వస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15 నుంచి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి చర్యలు చేపట్టిన నేపథ్యంలో వివిధ ప్రాంతాల్లో అధికార యంత్రాంగం పంపిణీ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అయితే మెట్పల్లిలో మాత్రం పంపిణీపై స్పష్టమైన సమాచారం లేకపోవడంతో ప్రజలు స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులను ప్రశ్నిస్తున్నారు. “చుట్టుపక్కల గ్రామాలకు స్మార్ట్ రేషన్ కార్డులు వచ్చాయి.. మరి మెట్పల్లి ప్రజలకు ఎప్పుడు?” అంటూ లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు.మెట్పల్లి ప్రాంతానికి సంబంధించిన స్మార్ట్ రేషన్ కార్డులు ఇప్పటికే వచ్చాయా? ఒకవేళ వచ్చి ఉంటే పంపిణీ ఎందుకు ప్రారంభించలేదు? ఇంకా రాకపోతే అందుకు కారణం ఏమిటి? పంపిణీలో జాప్యానికి బాధ్యత ఎవరిది? ప్రజలకు కార్డులు ఎప్పటి నుంచి అందజేస్తారు? అనే ప్రశ్నలకు సంబంధిత అధికారులు స్పష్టత ఇవ్వాలని లబ్ధిదారులు కోరుతున్నారు.ప్రజల సమస్యలపై స్పందించాల్సిన స్థానిక ప్రజాప్రతినిధులు ఈ అంశంపై వెంటనే దృష్టి సారించి, సంబంధిత అధికారులతో మాట్లాడి మెట్పల్లిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని త్వరితగతిన ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.మెట్పల్లి ప్రజల ప్రశ్న ఒక్కటే — పక్క గ్రామాల్లో పంపిణీ జరుగుతున్నప్పుడు మెట్పల్లికి మాత్రం ఎందుకు ఆలస్యం? స్మార్ట్ రేషన్ కార్డులు ప్రజలకు ఎప్పుడు అందుతాయి?