
జనం న్యూస్ జూలై 7, వికారాబాద్ జిల్లా పూడూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) నూతన పాలకవర్గం ఈరోజు బాధ్యతలు స్వీకరించింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పరిగి ఎమ్మెల్యే, టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి హాజరై నూతన పాలకవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా పి.రఘునాథ్ రెడ్డి పూడూరు పీఏసీఎస్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయగా,సురేందర్ ముదిరాజ్ వైస్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రైతులకు నాణ్యమైన సేవలు అందించడంతో పాటు సహకార సంఘాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించాలని నూతన పాలకవర్గానికి సూచించారు. రైతుల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొంటూ, రైతుల ప్రయోజనాల కోసం సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,సహకార సంఘ సభ్యులు,రైతులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.