
జనం న్యూస్, ఆగస్టు 18: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం తాళ్ల రాంపూర్ గ్రామంలో ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని పూర్తిగా నిషేధిస్తూ గ్రామ పంచాయతీ కీలక తీర్మానం చేసింది. ఈ మేరకు గ్రామంలో అవగాహన కార్యక్రమం నిర్వహించి వ్యాపారులకు నోటీసులు అందజేశారు. గ్రామంలోని కిరాణా దుకాణాలు, హోటళ్లు, ఇతర వ్యాపార సంస్థలను సందర్శించిన పంచాయతీ అధికారులు ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణానికి కలిగే నష్టాలను వివరించారు. ప్లాస్టిక్కు బదులుగా గుడ్డ సంచులు, కాగితపు సంచులు వంటి పర్యావరణహిత ప్రత్యామ్నాయాలను వినియోగించాలని సూచించారు.వచ్చే నెల 1వ తేదీ నుంచి గ్రామంలో ప్లాస్టిక్ కవర్ల వినియోగంపై పూర్తి నిషేధం అమల్లోకి రానుంది. అప్పటి వరకు వ్యాపారుల వద్ద ఉన్న పాత నిల్వలను మాత్రమే వినియోగించుకోవచ్చని, అనంతరం ఎట్టి పరిస్థితుల్లోనూ ప్లాస్టిక్ కవర్లు ఉపయోగించరాదని అధికారులు స్పష్టం చేశారు.