
జనం న్యూస్ సెప్టెంబర్ 10 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించాలని, వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రజలు ముందుకు రావాలని వక్తలు పిలుపునిచ్చారు.పర్యావరణ పరిరక్షణలో భాగంగా మన సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన మట్టి వినాయక విగ్రహాల పోస్టర్ను సీనియర్ పర్యావరణ ఇంజనీర్ డి. నరేందర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయనను మన సంఘం తరఫున శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేసి ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమాన్ని లయన్స్ క్లబ్ ఆఫ్ కూకట్పల్లి, జై గణేష్ భక్తి సమితి అధ్యక్షుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ వినాయక విగ్రహాల తయారీలో సహజసిద్ధమైన మట్టిని వినియోగించడం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుందని తెలిపారు. రసాయనాలతో తయారయ్యే విగ్రహాల వల్ల నీటి వనరులు కలుషితమయ్యే ప్రమాదం ఉందని, అందువల్ల ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలనే ప్రోత్సహించాలని కోరారు.భక్తితో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇచ్చేలా ప్రజల్లో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు. పర్యావరణహితమైన మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించడం ద్వారా భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.