
జనం న్యూస్, ఆగస్టు 9 – తెలంగాణ స్టేట్ ఇంచార్జ్: చింతకుంట్ల శ్రీనివాస్ రెడ్డికూకట్పల్లి: హనుమాన్ నగర్ కాలనీలోని మెయిన్ రోడ్డుపై, ప్రాథమిక ప్రభుత్వ ఆసుపత్రి పక్కనే చెత్త డంపింగ్ సమస్య రోజురోజుకూ తీవ్రమవుతోంది. ఆసుపత్రి పరిసరాల్లో చెత్త పేరుకుపోవడంతో దుర్వాసన వెదజల్లుతూ స్థానికులు, రోగులు, ఆసుపత్రి సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.కాలనీలో ప్రతిరోజూ ఇంటింటికీ చెత్త సేకరించేందుకు ప్రత్యేక వాహనాలు అందుబాటులో ఉన్నప్పటికీ కొందరు తమ బాధ్యతను విస్మరించి రాత్రి వేళల్లో రోడ్డుపై, ఆసుపత్రి పక్కనే చెత్తను పడేస్తున్నారని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే కొందరు వాహనదారులు సైతం ఇదే ప్రాంతాన్ని చెత్త వేయడానికి అనుకూల ప్రదేశంగా మార్చుకోవడంతో సమస్య మరింత తీవ్రమవుతోంది.చెత్త పేరుకుపోవడంతో దుర్వాసనతో పాటు దోమలు, ఈగలు విపరీతంగా పెరిగే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రి పక్కనే ఈ పరిస్థితి నెలకొనడం పట్ల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ఈ సమస్యపై పలుమార్లు ప్రజలకు అవగాహన కల్పించినప్పటికీ కొందరిలో మార్పు రావడం లేదని హనుమాన్ నగర్ కాలనీ అధ్యక్షులు మల్లేష్ యాదవ్ తెలిపారు. ఇకపై రోడ్డుపై చెత్త వేసే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.చెత్తను బహిరంగ ప్రదేశాల్లో వేయకుండా ప్రతి ఒక్కరూ ఇంటింటికీ వచ్చే చెత్త సేకరణ వాహనాలను వినియోగించాలని సూచించారు. సమస్య పునరావృతం కాకుండా చెత్త డంపింగ్ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు జరిమానా విధిస్తామని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి రోడ్డుపై చెత్త వేసే వారిని గుర్తించి జరిమానా విధించేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని సంబంధిత అధికారులు వెంటనే స్పందించి చెత్తను పూర్తిగా తొలగించడంతో పాటు, నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
