
జనం న్యూస్, జూలై 28, జగిత్యాలజిల్లా, మెట్పల్లి: పట్టణ మున్సిపల్ పరిధిలోని కూరగాయల మార్కెట్లో రోడ్లపై వీధి వ్యాపారులు కూర్చొని వ్యాపారం చేయడం వల్ల ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడుతున్న నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ గౌడ్ స్వయంగా మార్కెట్ను సందర్శించి పరిస్థితిని పరిశీలించారు.తనిఖీల సందర్భంగా రోడ్డుపై వ్యాపారం చేస్తున్న వీధి వ్యాపారులను వెనుకకు జరిపించి, మున్సిపాలిటీ కేటాయించిన స్థలంలోనే కూర్చొని కూరగాయలు విక్రయించుకునేలా చర్యలు చేపట్టారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, రోడ్లపై వ్యాపారం చేయడం వల్ల వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో పాటు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అందువల్ల వీధి వ్యాపారులు తప్పనిసరిగా కేటాయించిన స్థలంలోనే వ్యాపారం నిర్వహించాలని సూచించారు.అలాగే కూరగాయల మార్కెట్లోని దుకాణ యజమానులు రోడ్లపై ప్రకటన బోర్డులు ఏర్పాటు చేసి వీధి వ్యాపారులకు ఆటంకం కలిగించినట్లయితే మున్సిపల్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తోపుడు బండ్లపై రోడ్లకు అడ్డంగా వ్యాపారం నిర్వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.ప్రజలకు, వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వీధి వ్యాపారులు మున్సిపల్ అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో సానిటరీ ఇన్స్పెక్టర్ రాజ్కుమార్, ముజీబ్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.