
జనం న్యూస్ జూలై 2 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి : భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్టిన సమగ్ర ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీల్లో జరుగుతున్న హౌస్-టు-హౌస్ ప్రక్రియను మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు పరిశీలించారు. ఈ సందర్భంగా బూత్ లెవెల్ ఆఫీసర్లు (బీఎల్వోలు), బీఆర్ఎస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లతో కలిసి ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు హౌస్ ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేశారు. అలాగే ఓటరు నమోదు, వివరాల సవరణ, మార్పులు, చేర్పులకు సంబంధించిన అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాధవరం రంగారావు మాట్లాడుతూ, ప్రతి ఇంటికి బీఎల్వోలు, బూత్ లెవెల్ ఏజెంట్లు వెళ్లి హౌస్ ఎన్యూమరేషన్ ఫారంలో వివరాలను ఏ విధంగా నమోదు చేయాలో ఓటర్లకు స్పష్టంగా వివరించాలని సూచించారు. ప్రతి అర్హ ఓటరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా సవరణ ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులను కోరారు.ఓటరు జాబితాలో వివరాలు సక్రమంగా నమోదవ్వడం ప్రజాస్వామ్య పరిరక్షణకు ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక బూత్ లెవెల్ అధికారులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బూత్ లెవెల్ ఏజెంట్లు తదితరులు పాల్గొన్నారు.