జనం న్యూస్ 08 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఎలాంటి రాజకీయాలు చేయకుండా ప్రతి ఒక్కరికీ 2 సెంట్లు ఇంటి స్థలం ఇస్తామని, రేషన్ కార్డులు, పెన్షన్లు మంజూరు చేస్తామని ఇచ్చిన హామీలు తూచా తప్పకుండా అమలు చేయకపోతే సిపిఐ పేదల పక్షాన నిలబడి పోరాడుతుందని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్ హెచ్చరించారు. పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇంటి స్థలాలు ఇచ్చి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయిలు ప్రభుత్వ ఆర్థిక సాయం అందించాలని, ప్రస్తుతం ప్రభుత్వ స్థలంలో ఇల్లు కట్టుకుని నివాసం ఉంటున్న వారికి ఉన్న చోటే పట్టాలు మంజూరు చేయాలని, అర్హులైన వారికి రేషన్ కార్డులు, పెన్షన్లు మంజూరు చేయాలని, కరెంట్ బిల్లులతో సంబంధం లేకుండా డిమాండ్ చేస్తూ మంగళవారం ఉదయం సీపీఐ విజయనగరం నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో తహశీల్దారు కార్యాలయం వద్ద నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా బుగత అశోక మాట్లాడుతూ సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకునే కుటుంబాలకు ప్రభుత్వం సాయం అందిస్తే ఎన్నో కుటుంబాలకు మేలు జరుగుతుందన్నారు. సర్వేల పేరుతో ప్రభుత్వం కాలక్షేపం చేస్తోందనే విమర్శలు విన్పిస్తున్నాయన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల నిర్మాణ ప్రక్రియ సక్రమంగా ముందుకు సాగలేదని కూటమి అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ సాయం పెంచడంతో ఇళ్లు కట్టుకునేందుకు సొంత స్థలం ఉన్నవారు చాలా మంది ముందుకొస్తున్నారనీ అన్నారు. గ్రామాల్లో ఇంకా గృహ నిర్మాణాలకు సంబంధించిన ప్రక్రియ మొదలు కాలేదని అధికారులు చెబుతున్నారు. 2014-19 టిడిపి పాలనలోనే ఇదే పరిస్థితి నెలకొంది. తొలుత మూడేళ్లపాటు ఇళ్ల నిర్మాణాలకు అవకాశం ఇవ్వకుండా తర్వాత ఇచ్చారు. ఇళ్ల నిర్మాణం పూర్తయ్యే సరికి 2019 ఎన్నికలు దగ్గరపడ్డాయి. టిడిపి ఓటమి పాలైంది. తర్వాత వచ్చిన వైసిపి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో గృహనిర్మాణదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. పట్టణ ప్రాంతంలో రెండు సెంట్ల ఇళ్ల స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలివ్వాలని గతంలో అనేకసార్లు అర్హులైన వారితో వ్యక్తిగత అర్జీలు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టినప్పటికీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల హామీలలో భాగంగా కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులు గడుస్తున్నా పట్టించుకోకపోవడం విడ్డూరమన్నారు. గత ఐదేళ్లు పాలించిన జగన్ రెడ్డి రాష్ట్రంలో 30 లక్షల ఇల్లు నిర్మిస్తామని రాబోయే కాలంలో ఇంటి స్థలాలు ఇల్లు అడిగే పేదవారు లేకుండా చేస్తానని వాగ్దానం చేసి చేతులెత్తేసాడని ఆరోపించారు. పేదలను మరింత పేదవారిని చేసి గద్దె దిగిపోయాడని విమర్శించారు. తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రెండు సెంట్లు, మూడు సెంట్లు, ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షల అని చెప్పి ఇంతవరకు దాని గురించి పట్టించుకున్న పాపాన పోలేదన్నారు.ఇళ్ళు, టిడ్కోఇళ్ళను లబ్దిదారులకు పూర్తిగా అప్పగించకుండ నెలలు గడుస్తున్న ఇచ్చిన హామీలు అమలు చేయడంలో మీనమేషాలు లెక్కిస్తోందని విమర్శించారు ఇళ్ళ స్థలాలు, ఇంటి పట్టాలు పేదలు నివసించే ప్రాంతాల్లో మౌళిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇంటి స్థలాలు ఇచ్చి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయిలు ప్రభుత్వ ఆర్థిక సాయం అందించాలని, ప్రస్తుతం ప్రభుత్వ స్థలంలో ఇల్లు కట్టుకుని నివాసం ఉంటున్న వారికి ఉన్న చోటే పట్టాలు మంజూరు చేయాలని, అర్హులైన వారికి రేషన్ కార్డులు, పెన్షన్లు మంజూరు చేసేవరకు భారత కమ్యునిస్టు పార్టీ.(సిపిఐ) పేదల పక్షాన నిలబడి పోరాటాలు కొనసాగిస్తుందని బుగత అశోక్ హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్.రంగరాజు, మార్క్స్ నగర్ శాఖ కార్యదర్శి అప్పరుబోతు జగన్నాధం, సహాయ కార్యదర్శి బూర వాసు, శాంతి నగర్ శాఖ సహాయ కార్యదర్శి వెలగాడ రాజేష్, బల్జివీధి శాఖ కార్యదర్శి పొందూరు అప్పలరాజు మరియు ఇళ్ళ స్థలాల కోసం అర్జీలు పెట్టుకున్న మహిళలు హజరయ్యారు.