విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్.
జనం న్యూస్ 11 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
విజయనగరం జిల్లా పోలీసుశాఖలో పని చేసి, ఇటీవల అనారోగ్య కారణాలతో మరణించిన ఎఆర్ కానిస్టేబులు కుటుంబానికి “చేయూత”ను అందించేందుకు పోలీసు సిబ్బంది ప్రోగు చేసిన మొత్తాన్ని జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్, ఐపిఎస్ గారు ఏప్రిల్ 10న జిల్లా పోలీసు కార్యాలయంలో అందజేసారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ మాట్లాడుతూ - పోలీసుశాఖలో పని చేస్తూ ప్రమాదవ సాత్తు లేదా ఆకస్మికంగా లేదా అనారోగ్యంతో మరణించిన పోలీసు కుటుంబాలు అర్ధంతరంగా తమ కుటుంబ యజమానిని కోల్పోయి, ఆర్ధికంగా నష్టపోయిన సమయంలో వారికి ప్రభుత్వం నుండి బెనిఫిట్స్ అందేంత వరకు వారి
కుటుంబాలను ఆర్ధికంగా ఆదుకొనేందుకు పోలీసుశాఖకు చెందిన ఉద్యోగులు స్వచ్చందంగా ముందుకు వచ్చి, కొంత మొత్తాన్ని ప్రోగు చేసి, వారి కుటుంబాలకు “చేయూత''గా చెక్ ను అందజేయడం అభినందనీయమన్నారు. ఈ తరహా చర్యలు చేపట్టడం వలన పోలీసు ఉద్యోగుల్లో ఐకమత్యం పెరగడంతోపాటు, వారి కుటుంబాలకు అండగా ఉన్నామన్న భరోసా లభిస్తుందని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ అన్నారు. జిల్లా పోలీసుశాఖలో ఆర్మడ్ రిజర్వు విభాగంలో కానిస్టేబులుగా పని చేసిన సిహెచ్. గోపాలరావు అనారోగ్య కారణాలతో మార్చి 8న మరణించగా, వారి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకొనేందుకు 'చేయూత'గా పోలీసు సిబ్బంది ప్రోగు చేసిన రూ.1,48,000/- ల చెక్ను వారి సతీమణి సిహెచ్. శారదకు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్, ఐపిఎస్ గారు జిల్లా పోలీసు కార్యాలయంలో అందజేసారు. ప్రభుత్వం నుండి రావాల్సిన బెనిఫిట్స్, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం సకాలంలో కల్పించే విధంగా చర్యలు చేపడతామని, వెంటనే దరఖాస్తు చేయాలని, ఇతర దృవీకరణ పత్రాలను జిల్లా పోలీసు కార్యాలయానికి అందజేయాలని జిల్లా ఎస్పీ సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) పి.సౌమ్యలత, డిపిఒ ఎఓ పి.శ్రీనివాసరావు, ఆఫీసు సూపరింటెండెంట్ రామకృష్ణ, ఆర్ఐ ఎన్.గోపాల నాయుడు పోలీసు అసోసియేషను అడహక్ అధ్యక్షులు కే.శ్రీనివాసరావు మరియు పోలీసు కుటుంబ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.