అత్యవసర పరిస్థితుల్లో గోదాములకు ధాన్యం తరలించాలి
ధాన్యం కొనుగోలు పై జిల్లా కలెక్టర్ లు ప్రత్యేకంగా పర్యవేక్షించాలి
తాలు,తరుగు పేరిట ఎటువంటి కోతలు పెట్టవద్దు
ప్రభుత్వ పరిధిలో అత్యధికంగా రైస్ మిల్లులు మిల్లింగ్ చేసేలా చర్యలు
ధాన్యం కొనుగోలు పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
జనం న్యూస్,మే 01, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి
యాసంగి పంట కొనుగోలు వేగవంతం చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ,పౌరసరఫరాల శాఖ కమిషనర్ డి.ఎస్. చౌహాన్ లతో కలిసి ధాన్యం కొనుగోలు పై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, అదనపు కలెక్టర్ డి.వేణుతో కలిసి సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి పాల్గొన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ,తెలంగాణ రాష్ట్రంలో యాసంగి పంట 2024-25 సంవత్సరంలో 54 లక్షల 89 వేల ఎకరాలలో సాగు జరిగిందని, కోటి 37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా దాదాపు 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంటుందని అన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 2.55 లక్షల రైతుల నుంచి 19 లక్షల 60 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, వీరికి 2 వేల 289 కోట్లు మద్దతు ధర కింద చెల్లించామని, యాసంగి పంట కింద ఇప్పటి వరకు కొనుగోలు చేసిన 8 .8 లక్షల మెట్రిక్ టన్నుల సన్న రకం ధాన్యానికి బోనస్ చెల్లించడం జరుగుతుందని అన్నారు. మే నెలలో కొనుగోలు కేంద్రాలకు అధికంగా ధాన్యం రానున్న నేపథ్యంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అకాల వర్షాలు కారణంగా రైతులు నష్టపోకుండా నాణ్యమైన ధాన్యాన్ని వేగవంతంగా కొనుగోలు చేయాలని మంత్రి సూచించారు. రానున్న 15 నుంచి 20 రోజుల పాటు సజావుగా ధాన్యం కొనుగోలు చేయడం ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యత అంశమని అన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద ఎటువంటి లోటుపాట్లు ఉండటానికి వీలులేదని అన్నారు. ధాన్యం కొనుగోలు అంశంలో రైతులు ధర్నా చేయాల్సిన పరిస్థితి ఎక్కడ రావద్దని మంత్రి అధికారులను ఆదేశించారు. రైస్ మిల్లులకు కేటాయించే ధాన్యం విలువలో 35% మాత్రమే మనం బ్యాంక్ గ్యారెంటీ అడిగామని, ఏ అంశంలో మినహాయింపులు ఇవ్వడం కుదరదని మంత్రి పేర్కొన్నారు. రైస్ మిల్లర్లతో కలెక్టర్, ఉన్నతాధికారులు చర్చించాలని, జిల్లాలలో అవసరమైతే గోదాములకు కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించాలని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల మెట్రిక్ టన్నుల ఇంటర్మీడియట్ గోదాముల కేటాయింపు జిల్లాల వారీగా అవసరం బట్టి మంజూరు చేయాలని మంత్రి పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులకు సూచించారు. ప్రభుత్వానికి ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ రైతులకు సమస్య రాకుండా చూసుకోవాలని అన్నారు. రైతుల దగ్గర నుంచి మద్దతు ధర పై ధాన్యం కొనుగోలు చేయడం ప్రాధాన్యతగా అత్యవసర పరిస్థితుల్లో డిఫాల్ట్ రైస్ మిల్లర్లకు దానం కేటాయింపు చేయడానికి అనుమతులు కూడా కలెక్టర్లకు జారీ చేస్తున్నామని తెలిపారు. హార్వెస్టర్ల తో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి పంట కోతల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించాలని అన్నారు. ధాన్యం కొనుగోలుపై వివిధ రాజకీయ పక్షాలు పత్రికలు, సామాజిక మాధ్యమాల ద్వారా చేస్తున్న దుష్ప్రచారాన్ని అధికారులు తిప్పి కొట్టాలని, ఎక్కడైనా నిజంగానే ఇబ్బందులు ఉంటే వాటిని సత్వరమే పరిష్కరించాలని మంత్రి సూచించారు.వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న పౌరసరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహన్ మాట్లాడుతూ,జిల్లాలో ఉన్న రైస్ మిల్లర్లు నిబంధనలు ప్రకారం నడుచుకునేలా కలెక్టర్ అదనపు కలెక్టర్లు పకడ్బందీగా పర్యవేక్షించాలని, అత్యధికంగా రైస్ మిల్లులు ప్రభుత్వ పరిధిలోనే ధాన్యం ప్రాధాన్యతతో బిల్డింగ్ చేసేలా చూడాలని అన్నారు. ధాన్యం రవాణాకు వాహనాల ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని, రైస్ మిల్లుల వద్ద ధాన్యం బస్తాల అన్ లోడింగ్ ఆలస్యం కాకుండా చూడాలని, హమాలీల కొరత ఉండకుండా జాగ్రత్త పడాలని అన్నారు. కొనుగోలు కేంద్రాల వద్దకు పెద్ద ఎత్తున ధాన్యం వస్తున్నప్పటికీ వేగవంతంగా కొనుగోలు చేయడంలో కొంత ఆలస్యం జరుగుతుందని, వీటిని సంపూర్ణంగా నివారించాలని అన్నారు. ధాన్యం కొనుగోలు అంశంపై జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించి ప్రత్యేకంగా మానిటర్ చేయాలని అన్నారు. రైస్ మిల్లర్లు తాలు, తరుగు పేరు మీద ఎటువంటి కోతలు లేకుండా జాగ్రత్తలు పాటించాలని అన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద గన్ని బ్యాగులు ఉండాలని రైతులకు నేరుగా ఇవ్వవద్దని, మనం కొనుగోలు చేసిన ధాన్యం నింపేందుకు మాత్రమే వినియోగించాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా మేనేజర్ శ్రీకాంత్, డీఎస్ఓ రాజేందర్, డి. ఆర్డి. ఓ కాలిందిని, సంబంధిత అధికారులు, సంబంధిత అధికారు లు, తదితరులు పాల్గొన్నారు.