విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్
జనం న్యూస్ 01 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
విజయనగరం పట్టణం అయ్యన్నపేటలో ఒక విశ్రాంత భవనంలో ఏప్రిల్ 29న రాత్రి పేకాట ఆడుతున్న వారిపై విజయనగరం వన్ టౌన్ ఇన్స్పెక్టరు ఆధ్వర్యంలో రైడ్ నిర్వహించి, పేకాట ఆడుతున్న 9మందిని అరెస్టు చేసి, వారి వద్ద నుండి 9 మొబైల్ ఫోన్లు, రూ.95,390/-ల నగదును సీజ్ చేసినట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఏప్రిల్ 30న తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ - జిల్లాలో ఎక్కడా ఆర్గనైజ్డ్ గా పేకాట జరగకూడదని, ఎవరైనా పేకాట నిర్వహిస్తూ, పట్టుబడితే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవన్నారు. విజయనగరం పట్టణం అయ్యన్నపేటలోని ఒక విశ్రాంత భవనంలో కొంతమంది వ్యక్తులు పేకాట ఆడుతన్నట్లుగా ఏప్రిల్ 29న రాత్రి వచ్చిన ఖచ్చితమైన సమాచారంతో విజయనగరం వన్ టౌన్ ఇన్స్పెక్టరు ఎస్.శ్రీనివాస్, ఎస్ఐ సురేంద్ర నాయుడు మరియు ఇతర పోలీసు బృందంతో రైడ్ చేసి, పేకాట ఆడుతున్న 9మందిని అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుండి 9 మొబైల్ ఫోన్లు, రూ.95,390/-ల నగదు, పేక ముక్కలను సీజ్ చేసామన్నారు. పట్టుబడిన వారందరూ పట్టణంలో వివిధ రకాల వ్యాపారాలు
నిర్వహిస్తూ, జీవిస్తున్నారని, గతంలో కూడా వీరంతా పలుమార్లు వివిధ పోలీసు స్టేషను పరిధిలో పేకాట ఆడుతూ పట్టుబడ్డారన్నారు. రిపీటెడ్ గా పేకాట ఆడుతున్న వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీవకుల్ జిందల్ హెచ్చరించారు. జిల్లాలో ఎక్కడా అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ముందస్తుగా సమాచారం సేకరించి, డ్రోన్స్ తో దాడులు నిర్వహించి, అసాంఘిక శక్తులపై చట్టపరమైన కఠిన చర్యలు చేపడుతున్నామన్నారు. గత నాలుగు మాసాల్లో జిల్లా వ్యాప్తంగా పేకాట, కోడి/గొర్రె పందాలు ఆడుతున్న వారిపై దాడులు నిర్వహిస్తున్నామన్నారు. ఈ సంవత్సరం దాడులు నిర్వహించి, పేకాట ఆడిన 522 మందిపై 90 కేనులు నమోదు చేసి, రూ.17.49 లక్షల నగదు సీజ్ చేసామన్నారు. అదే విధంగా కోడి పందాలు ఆడుతున్న 145 మందిపై 28 కేసులు నమోదు చేసి, 65 కోడి పుంజులు, 4 గొర్రెపోతులు, రూ.1.16 లక్షల నగదు సీజ్ చేసామని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. విజయనగరం పట్టణం అయ్యన్నపేటలో నిర్వహించిన పేకాట రైడ్లో వన్ టౌన్ సిఐ ఎస్.శ్రీనివాస్, ఎస్సై సురేంద్ర నాయుడు, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.