జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 2 రిపోర్టర్ సలికినీడి నాగరాజు
జన గణ మన పాడే ప్రతి ఒక్కరూ కులగణన ను సమర్ధించడం ద్వారా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్న సామాజిక న్యాయం, సమ సమాజ స్థాపన జరుగుతుందనే రాహుల్ గాంధీ ఆలోచనను కేంద్ర ప్రభుత్వం ఆమోదించడం హర్షణీయమని చిలకలూరిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త ఎం రాధాకృష్ణ అన్నారు. రాహుల్ గాంధీ చేసిన కులగణన సూచనను కేంద్ర ప్రభుత్వం భేషజాలకు పోయి ఇంతకాలం పాటు అడ్డుకోవడం అసమంజసమని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం కులగణన ద్వారా ఏర్పాటు అయ్యే సమసమాజ స్థాపనకు మోకాలడ్డు పెట్టడంతో కాంగ్రెస్ పార్టీ తన ఆలోచన విధానానికి రూపునిస్తూ మొట్టమొదట కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కులగణన చేపట్టడానికి శ్రీకారం చుట్టిందన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో కులగణనను విజయవంతంగా పూర్తి చేసి కేంద్ర ప్రభుత్వం తో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శప్రాయంగా నిలిచిందన్నారు. సామాజిక అంతరాలు తొలగించి సత్ఫలితాలు సాధించే అవకాశం మెండుగా ఉండడంతో కేంద్ర ప్రభుత్వం కూడా ఆలస్యంగా నైనా కుల గణనను చేపట్టాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. రాహుల్ గాంధీ ఆలోచన నేడు దేశ రాజకీయాలను ప్రభావితం చేసే స్థితికి చేరుకోవడం శుభ పరిణామం అని అన్నారు. ఈ అంశం ద్వారా రాహుల్ గాంధీ సాధారణ నాయకునిగా కాక రాజనీతిజ్ఞుని గా పేద, బలహీన వర్గాల ప్రజల హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని అన్నారు. ఈ అంశం ఆచరణలోకొచ్చిన తరువాత దేశంలోని మధ్యతరగతి దిగు మధ్యతరగతి పేదరిక వర్గాలలో అత్యధిక శాతంగా ఉన్న బలహీన వర్గాల వారికి అద్భుతమైన మేలు జరుగుతుందని సమాజంలోని అంతరాలు రూపుమాపడానికి సరైన మార్గం లభిస్తుందని అన్నారు. ప్రభుత్వ ఫలాలు ఫలితాలు జనాభా ప్రాతిపదికన అందరికీ న్యాయంగా అందుతాయని అన్నారు .జోడోయాత్ర ద్వారా ప్రజల మధ్య గల అంతరాలు జరుగుతున్న అన్యాయాలను క్షుణ్ణంగా తెలుసుకున్న రాహుల్ గాంధీ కులగణన ఒక్కటే దేశ ప్రజల సమస్యల పరిష్కార సంజీవని అవుతుందని గుర్తించి, సూచించడం ద్వారా ప్రజా హృదయాలలో దార్శనికుడిగా నిలిచారన్నారు.