వడగాల్పులకు జిల్లా ప్రజలు ఇబ్బందులు పడకుండా అధికారులు అవగాహన కల్పించాలి
వేసవిలో జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి
సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
జనం న్యూస్ మే 04(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)
సూర్యాపేట జిల్లాలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు అవుతున్నందున,ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని వడదెబ్బ తగలకుండా సూర్యాపేట జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తెజస్ నంద్ లాల్ పవార్ ఒక ప్రకటన తెలిపారు.వేసవిలో ప్రజలు ఎండ తీవ్రత తో వడదెబ్బ తగిలితే తీసుకోవాల్సిన జాగ్రత్తల పై కలెక్టర్ వివరించారు.ప్రజలు వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు పాటించాలని, ఎండల్లో బయట తిరగకుండా జాగ్రత్త వహించాలని, అత్యవసర పరిస్థితి అయితే తప్ప బయటికి రాకూడదని, మద్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల మద్యలో ఎట్టి పరిస్థితులలో ఇండ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు ఆయన సూచించారు.ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో వడ దెబ్బలు, ఇతర సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వివరించారు.అలాగే ప్రభుత్వ ఏరియా ఆసుపత్రులలో వేసవి తీవ్రత ను దృష్టిలో ఉంచుకొని తగినన్ని మందులు అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. వడదెబ్బ తగిలిన వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎక్కువగా ప్రచారం చేయాలని ఆదేశించారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండలలో పనిచేయవద్దని ఆల్కహాల్ ,టీ, కాఫీ, స్వీట్స్ చల్లని డ్రింక్స్ తీసుకోవద్దని , చెప్పులు లేకుండా బయట నడవవద్దని తెలిపారు. ముఖ్యంగా చిన్నారులు, వయోవృద్దులు ఇంటికే పరిమితం కావాలని, ప్రతి రోజు సరిపడ నీరు త్రాగాలని, వదులుగా ఉన్న దుస్తువులను ధరించాలని, బయటికి వెళ్ళేటప్పడు గొడుగు లేదా టోపిని దరించాలని, ద్విచక్రవాహానాల పై సుదూర ప్రయాణాలు చేయకూడదని సూర్యుని కిరణాలు శరీరంపై పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. అలాగే ఎండలో పనిచేసే కార్మికులు తరచుగా నీటీతో పాటు ఓఆర్ఎస్ ద్రావణాన్ని తీసుకోవాలని తద్వారా వడదెబ్బ నుండి శరీరాన్ని కాపాడు కోవచ్చన్నారు.చర్మం పై ఎర్రటి దద్దుర్లు, చర్మం పొడిబారడం లాంటివి చర్మం పై వస్తున్న మార్పులను గమనించాలని, అధిక శరీర ఉష్ణోగ్రత, అలసట, నోరు ఎండి పోవడం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, వాంతులు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే సమీప ప్రభుత్వ ఆసుపత్రులలో సంప్రదించి లేదా 108 కు ఫోన్ చేసి చికిత్స, అవసరమైన మందులు తీసుకోవాలని అన్నారు.వేసవి కాలంలో పలు జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు.