జనం న్యూస్ మే 03 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
అసిఫాబాద్ జిల్లా కేంద్రం ఏర్పాటు చేసిన సమావేశం కామ్రేడ్ కలవేణ శంకర్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాట్లాడుతూ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా మహాసభలను ఈనెల 25న విజయవంతంగా నిర్వహించుకోవడం జరుగుతుందని దీనికి అందరూ సహాయ సకారాలు అందించాలని కోరడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తూ,వారిని చైతన్య పరిచి ప్రజా ఉద్యమాలు నిర్మించాలని వారు తెలిపారు.ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2025-26 ఆర్థిక బడ్జెట్ ప్రభుత్వం యొక్క కార్పోరేట్ అనుకూల, ప్రజా వ్యతిరేక ఎజెండాను ప్రతిబింబిస్తున్నది. కార్పోరేట్లకు పన్నురాయితీలు, మరియు బడా వ్యాపారులకు రాయితీలు కొనసాగిస్తూ, ఆరోగ్యం, విద్య, గ్రామీణ ఉపాధి, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, మరియు సంక్షేమ పథకాలకు బడ్జెట్లో కేటాయింపులు తగ్గించారు. నిరుద్యోగం, పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, వ్యవసాయ రంగంలో ఎదురవుతున్న ఇబ్బందులను బడ్జెట్లో పట్టించుకోలేదు. ఈ బడ్జెట్ కార్మిక, రైతు వ్యతిరేక, కార్పోరేట్లకు అనుకూలమైన బడ్జెట్ అని వారు తెలిపారు.తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాదిన్నర పూర్తవుతున్నది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో కొన్నింటిని అమలు చేసినా, ఇంకా అమలు చేయవలసినవి చాలా ఉన్నాయి. అమలు చేసిన వాటిలో కూడా రైతు రుణమాఫీ, రైతు భరోసా, పంటల బీమా పథకం విషయాలలో రైతులలో తీవ్ర అసంతృప్తి నెలకొన్నది. ఈ హామీల అమలులో ప్రభుత్వ తీరు సంతృప్తిగా లేదు. మహిళలకు ఉచిత బస్సు, రూ. 500/- గ్యాస్ సిలెండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, కొంత సానుకూల ప్రభావాన్ని చూపాయి. ఇటీవల ప్రారంభించిన సన్నబియ్యం పథకం కూడా ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చింది. అయితే మిగిలిన హామీల అమలుకు కాంగ్రెస్ పార్టీ పూనుకోకపోతే ఇబ్బందులు తప్పవు. బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల వలన ఆర్థిక సంక్షోభం ఉన్నా, దీనిని అధిగమించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైన ఉన్నదని వారు పేర్కొన్నారు. అదేవిధంగా 2026 మార్చి నాటికి దేశంలో నక్సల్స్ లేకుండా చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ ప్రకటించి మారణహోమం సృష్టిస్తున్నాడు. 2025 సంవత్సరంలో ఆపరేషన్ కగార్ పేరుతో నక్సల్ను తుదిముట్టిస్తున్నారు. భద్రతా దళాలను రంగంలోకి దించి, వేల మంది భద్రతా దళాలు, పోలీసులు, అత్యాధునిక ఆయుధాలు, హెలికాప్టర్లు, డ్రోన్ల సహాయంతో ఎన్ కౌంటర్లు, హత్యలు చేస్తున్నారు. కొద్ది నెలలోనే సుమారు 150 మందికి పైగా మావోయిస్టులను ఎన్ కౌంటర్లలో హతమార్చారు. బస్తర్, బీజాపూర్, కంకర్ ప్రాంతాలలో ఎన్కౌంటర్లు పెరిగాయి, నక్సల్స్ శాంతి చర్చలకు సుముఖత వ్యక్తం చేస్తూ ప్రకటన చేసినా, ప్రభుత్వం పట్టించుకోకుండా ఆపరేషన్ కొనసాగిస్తున్నది. తెలంగాణలో శాంతి కమిటీ ఏర్పడి ప్రభుత్వం చర్చలకు పిలచాలని కోరినా, ప్రభుత్వం పట్టించుకోలేదు.బస్తర్ ప్రాంతంలో ఆదివాసీలకు అండగా నిలబడుతున్న సిపిఐ పార్టీ పైన కక్షతో, ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలలో బస్తర్ ప్రాంతంలో సిపిఐ మెరుగైన ఫలితాలు సాధించిన తర్వాత సిపిఐ నాయకుడు మనీష్ కుంజాం ఇంటిపై ఇ.డి.దాడి చేసి సోదాలు నిర్వహించడం బిజెపి తనను వ్యతిరేకించే వారిపై ప్రభుత్వ సంస్థల ద్వారా దాడులుచేసి బెదరించే ధోరణి మరోసారి రుజువైనది. ఎన్ కౌంటర్ల ద్వారా నక్సల్స్ను హతమార్చే ప్రభుత్వ విధానాన్ని ఖండిస్తూ ఆపరేషన్ కగార్ ని నిలిపి వేసి నక్సలు చర్చలకు ఆహ్వానించాలని, నక్సల్స్ కూడా ఆయుధాలు విడిచి ప్రజాస్రవంతిలోకి వచ్చి రాజకీయాలలో పాల్గొనాలని సీపీఐ పార్టీ పిలుపునిచ్చిందని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి బద్రి సత్యనారాయణ మాట్లాడుతూ జిల్లా మహాసభ నిర్వహించే తేదీలోపు ఆయా మండలాల శాఖల మహాసభలను నిర్వహించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఆత్మకూరి చిరంజీవి, తాళ్లపల్లి దివాకర్ లు పాల్గొన్నారు.