* నాణ్యమైన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తాం
* కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని సత్వరమే అందుబాటులోకి తీసుకొనిరావాలి.
* మంథని ప్రాంతంలో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్
జనం న్యూస్, మే 07, పెద్దపెల్లి జిల్లా ప్రతినిధి వరంగల్ మంచిర్యాల జాతీయ రహదారి సి.ఎన్.జి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు.మంగళవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మంథని మండలంలో విస్తృతంగా పర్యటించారు. మంథని మండలం లోని వేం పాడు గ్రామంలో జరుగుతున్న జాతీయ రహదారి పనులు, పుట్ట పాక గ్రామం, మంథని వ్యవసాయ మార్కెట్ యార్డ్, ఏక్లాస్ పూర్ గ్రామాలలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను, మంథని పట్టణం పాత పాల కేంద్రంలో కుట్టు శిక్షణ కేంద్రం ఏర్పాటు పనులను కలెక్టర్ పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, వరంగల్ - మంచిర్యాల జాతీయ రహదారి కి సంబంధించి జరుగుతున్న సీ.ఎన్.జి పనులను వేగవంతం చేయాలని, 3 రోజుల వ్యవధి లోగా ఈ పనులు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. యాసంగి పంట సీజన్ లో రైతులు పండించిన నాణ్యమైన ధాన్యం చివరి గింజ వరకు ప్రభుత్వం మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తుందని కలెక్టర్ తెలిపారు. ధాన్యం కొనుగోలు వేగవంతంగా జరుగుతుందని, కొనుగోలు కేంద్రాల వద్ద అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామని, ఎఫ్.ఏ.క్యూ ప్రమాణాలు రాగానే కొనుగోలు చేస్తున్నామని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని సత్వరమే కేటాయించిన రైస్ మిల్లులకు తరలించేలా ఏర్పాటు చేశామని అన్నారు.మంథని పట్టణ ప్రాంతంలో మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ శిక్షణ అందించేందుకు వీలుగా ఏర్పాటు చేస్తున్న ట్రైనింగ్ సెంటర్ 3 రోజులలో పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొని రావాలని అన్నారు. అనంతరం రామగిరి మండలంలోని ఆదివారం పేట గ్రామంలో జరుగుతున్న జాతీయ రహదారి సీ.ఎన్.జి పనులను కలెక్టర్ పరిశీలించి వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు తెలిపారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా సహకార అధికారి శ్రీ మాల, మంథని మున్సిపల్ కమిషనర్ మనోహర్, మంథని తహసిల్దార్ కుమారస్వామి,రామగిరి తహసిల్దార్ సుమన్, ఏడిఎం అంజని, ప్యాక్స్ సీఈఓ అశోక్, ఏపిఎం పద్మ, ఏఈ మౌనిక, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.