జనం న్యూస్ మే 15 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి
కాళేశ్వరం త్రివేణి సంగమం వేద మంత్రోఛ్చారణలతో మారుమోగుతోంది. దక్షిణాది రాష్ట్రాల్లోనే ఏకైక క్షేత్రం అంతర్వాహినిగా ప్రవహిస్తున్న సరస్వతి సంగంమంలో ఉదయం 5.44 నిమిషాలకు పుష్కరాలు లాంఛనంగా ప్రారంభం అయ్యాయి. కాగా, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు - పద్మ దంపతులు వేకువ జామునే త్రివేణి సంగమంలో పుష్కర స్నానం చేశారు. త్రివేణి సంగమ క్షేత్రం, త్రిలింగ క్షేత్రం అయిన కాళేశ్వరం అత్యంత అరుదైన ఘట్టానికి వేదికగా నిలిచింది. ఇప్పటి వరకూ సoప్రదాయానికే పరిమితమైన సరస్వతి పుష్కరాలు ఈ సారి సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. గోదావరి, ప్రాణహిత నదులు కలిసిన చోట అంతర్వాహినిగా సరస్వతీ నది ఉద్భవించిన ప్రాంతంలో సరస్వతి పుష్కరాలు ప్రారంభమయ్యాయి. అదేవిధంగా, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, ఆయన సతీమణీ, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, హైకోర్టు న్యాయమూర్తి సూరపల్లి నంద, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పోరేషన్ ఛైర్మన్ ఐత ప్రకాష్ రెడ్డి, భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ లతో పాటు పలువురు ప్రముఖులు త్రివేణి సంగమ క్షేత్రంలో సరస్వతీ పుష్కర వేడుక ప్రారంభోత్సవ కార్యక్రమానికి హజరయ్యారు.