విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్.
జనం న్యూస్ 17 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
నేర నియంత్రణకు క్షేత్ర స్థాయిలో మహిళా సంరక్షణ పోలీసులు (ఎం.ఎస్.పి.లు), పోలీసు సిబ్బంది
నిర్వహించే విధులే క్రియాశీలకమని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మే 16న అన్నారు. డెంకాడ పోలీసు స్టేషను ప్రక్కనే అభివృద్ధిపర్చిన భవనంలో ఏర్పాటు చేసిన భోగాపురం సర్కిల్ కార్యాలయాన్ని, సిఐ చాంబరును జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ప్రారంభించి, పోలీసు స్టేషన్ ప్రాంగణంలో మొక్కలను నాటారు. అనంతరం, మహిళా సంరక్షణ పోలీసులు (ఎం.ఎస్.పి.లు), పోలీసు స్టేషను సిబ్బందితో జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మమేకమయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ - నేర నియంత్రణ, సమాచార సేకరణ, నిఘా ఏర్పాటు చేయుటలో క్షేత్ర స్థాయిలో మహిళా సంరక్షణ పోలీసులు, దత్తత పోలీసులు నిర్వహించే విధులే క్రియాశీలకమన్నారు. మహిళా పోలీసులు నిర్వహించే విధులను పర్యవేక్షించేందుకు ఇటీవలనే ప్రత్యేకంగా వెబ్సైట్ను ప్రారంభించామన్నారు. ఈ వెబ్సైట్ మహిళా సంరక్షణ పోలీసులకు ఏవిధంగా ఉపయోగపడుతున్నదన్న విషయాలను ఎం.ఎస్.పి.లను జిల్లా ఎస్పీ అడిగి తెలుసుకున్నారు. ఎం.ఎస్.పి.లు తమ పరిధిలో ఉన్న గ్రామాల్లో నిఘా ఏర్పాటు చేయాలని, క్రొత్తగా వచ్చే వ్యక్తులు గురించి, ఒంటరి మహిళలు, పాత నేరస్థులు, హిస్టరీ షీట్లు కలిగిన వ్యక్తుల ప్రవర్తన గురించి నిఘా ఏర్పాటు చేయాలన్నారు. అంతేకాకుండా, నేర నియంత్రణకు ముఖ్య ప్రాంతాల్లో సిసి కెమెరాల ఏర్పాటుకు చొరవ
చూపాలన్నారు. ఎం.ఎస్.పి.లు నిర్వహించే విధులను ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా రూపొందించిన వెబ్సైట్లో నిక్షిప్తం చేయాలన్నారు. వెబ్సైట్లో నిక్షిప్తం చేసిన విధులను ప్రతీ మాసం పర్యవేక్షించి, ఉత్తమంగా సేవలందించే వారిని ప్రోత్సహిస్తామన్నారు. అనంతరం, భోగాపురం సర్కిల్ పరిధిలోని పోలీసు సిబ్బందితో మమేకమయ్యారు. ఈ-బీట్స్ సమర్ధవంతంగా అమలు చేయాలని, దత్తతగా గ్రామాలను విధిగా సందర్శించాలని, గ్రామంలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చర్యలు చేపట్టాలని, సమాచారాన్ని సంబంధిత ఎస్.హెచ్.ఓ.కు అందించాలన్నారు. దత్తత గ్రామంలో నిఘా ఏర్పాటు చేయాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అంశాలు, భూతగాదాలు గురించి కుణ్ణంగా తెలుసుకోవాలని, సమాచారాన్ని ఉన్నతాధికారులకు సకాలంలో అందించాలన్నారు. పోలీసు స్టేషను పరిధిలో ఎటువంటి
శాంతిభద్రతల సమస్యలు ఉత్పన్నం కాకుండా పోలీసు అధికారులు, సిబ్బంది, ఎం.ఎస్.పి.లు సమన్వయంతో పని చేయాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో విజయనగరం డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు, భోగాపురం రూరల్ సిఐ జి.రామకృష్ణ, ఎస్బీ సిఐలు ఎవి లీలారావు, ఆర్.వి.ఆర్.కే.చౌదరి, ఎస్ఐలు ఎ.సన్యాసి నాయుడు, ఐ.దుర్గా ప్రసాద్, గణేష్ మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.