నెలకు రూ.15 కోట్ల నుంచి రూ.20కోట్లు..!!
రెండేళ్ల నుంచి కాల్ సెంటర్ నిర్వహణ
అమెరికా సహా ఇతర దేశాల ప్రజలే లక్ష్యంగా మోసాలు
జనం న్యూస్,మే23,అచ్యుతాపురం:
రాష్ట్రవ్యాప్తంగా సైబర్ నేరగాళ్లు చెలరేగి పోతున్నారు. వివిధ రకాలుగా మోసగించి రూ.కోట్లు దోచేస్తున్నారు. కష్టపడి పని చెయ్యకుండా ప్రజలను మోసం చేసి జల్సాగా జీవితాన్ని గడుపుతున్నారు కొందరు సైబర్ నేరగాళ్లు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం కాల్సెంటర్ ద్వారా అమెరికా వాసులను లక్ష్యంగా చేసుకొని సైబర్ నేరాలకు పాల్పడిన ముఠాను అరెస్టు చేసినట్టు ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు అచ్యుతాపురం కేంద్రంగా రెండేళ్ల నుంచి కాల్ సెంటర్ నిర్వహిస్తూ అమెరికా సహా ఇతర దేశాల ప్రజలే లక్ష్యంగా మోసాలకు పాల్పడుతున్నట్టు దర్యాప్తులో తేలిందన్నారు.నెలకు రూ.15 కోట్ల నుంచి రూ.20కోట్ల వరకు సైబర్ మోసాలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు.అచ్యుతాపురం కాల్సెంటర్లో 200 నుంచి 250 మంది వరకు పని చేస్తున్నట్టు జిల్లా ఎస్పీ తెలిపారు. కాల్సెంటర్ల ముసుగులో సైబర్ మోసాలకు పాల్పడుతున్న 33 మందిని అరెస్టు చేశామన్నారు.