జనంన్యూస్. 29. నిజామాబాదు. ప్రతినిధి.. శ్రీనివాస్.
కేంద్ర ప్రభుత్వం నిన్న 14 రకాల పంటలకు మద్దతు ధరలను నిర్ణయంచేసి ప్రకటించింది. ధాన్యం పండించిన అన్నదాతను ఆదుకోలేని, మద్దతు గా నిలబెట్టలేని మద్దతు ధరలు ఉన్నాయని అఖిలభారత రైతుకూలీ సంఘం AIKMS జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య అన్నారు. తేదీ 29-5-2025 న జిల్లా కేంద్రంలోని NR భవన్ లో AIKMS ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో భూమయ్య మాట్లాడుతూ వ్యవసాయంలో పంటల పెట్టుబడి ఖర్చులు రోజురోజుకు పెరుగుతున్నాయని సంవత్సరానికి 10 నుంచి 12% పెరుగుతుంటే మద్దతు ధరలు మాత్రం మూడు శాతానికి పెరగడం లేదని ఆయన అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సిఫార్సు చేసినా విధంగా ధాన్యానికి ధరలు పెంచలేదని కేవలం వరికి క్వింటాలుకి 69 రూపాయలు పెంచి చేతులు దులుపుకున్నారని వారన్నారు. దేశంలో వరి పంట దిగుబడి లో తెలంగాణ నెంబర్ వన్ గా నిలిచిందని అలాంటి పంటకు 69 రూపాయలు పెంచడంలో ఔచిత్యం ఏమిటని భూమయ్య అన్నారు. మద్దతు ధర నిర్ణయించడం లో ప్రభుత్వాలు రైతుల పెట్టుబడులను, రైతు శ్రమను, శాస్త్రీయంగా గుర్తించడం లేదని ,స్వామినాథం సూచనలు అమలు పరచడం లేదని వారన్నారు.
పంట పెట్టుబడులపై C 2 ± 50% అదనంగా కలిపి ధరలు నిర్ణయించాలని రైతు ఉద్యమం డిమాండ్ చేస్తుందని వారు అన్నారూ. ఈ సంవత్సరం లో ముందుగానే ఖరీఫ్ సీజన్ ప్రారంభం అవుతున్నందున రైతులకు సరిపడ నాణ్యమైన విత్తనాలు సప్లై చేయాలని, నకిలీ విత్తనాల వ్యాపారుల మోసాలకు గురి కాకుండా చూడాలని వారన్నారు. మొత్తం తెలంగాణలో విత్తనాలు సప్లై ప్రభుత్వ సంస్థల కన్నా ప్రైవేట్ విత్తన కంపెనీలు నేటికీ వారే 70% అందిస్తున్నారని కేవలం 30 శాతం మాత్రమే ప్రభుత్వ విత్తనా సంస్థల ద్వారా విత్తనాలు అందుబాటులో ఉన్నాయని వారన్నారు. ప్రైవేట్ విత్తన సంస్థ వ్యాపారులు నకిలీ విత్తనాలతో రైతులను నిలువు దోపిడీ గురి చేస్తున్నారని వారి దోపిడిని అరికట్టి రైతులను ఆదుకోవాలని వారన్నారు.
తెలంగాణ విత్తన అభివృద్ధి సంస్థకు ప్రభుత్వం ఇవ్వాల్సిన 540 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేసి సంస్థ అభివృద్ధికి తోడ్పడాలని వారు కోరారు. తెలంగాణ విత్తన అభివృద్ధి సంస్థ ద్వారానే రైతులకు అన్ని రకాల సరిపడా విత్తనాలు అందించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులకు సరిపడా అన్ని రకాల ఎరువులు, విత్తనాలు, రుణాలు అందించాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. ఇంకా ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి దేశెట్టి సాయ రెడ్డి, జిల్లా నాయకులు బి.సాయిలు, గంగాధర్, బి.బుచ్చన్న తదితరులు పాల్గొన్నారు.