బిచ్కుంద మే 31 జనం న్యూస్
పొగాకు నుంచి "దేశానికి", పొగాకు ఉత్పత్తుల నుంచి "దేహానికి "విముక్తి కలిగినప్పుడే అసలు సిసలైన ఆరోగ్య స్వతంత్రం అని బిచ్కుంద కోర్టు న్యాయమూర్తి వినీల్ కుమార్ అన్నారు. పొగాకు ఉత్పత్తుల వాడకాన్ని మండలాలల్లో నియంత్రించే కార్యక్రమంలో భాగంగా మండల న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయవిజ్ఞాన సదస్సు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన బిచ్కుంద కోర్టు న్యాయమూర్తి వినీల్ కుమార్ మాట్లాడుతూ అవగాహన కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించాలని మండల ఉన్నతాధికరులను , సంబంధిత శాఖ అధికారులకు సూచించారు. శనివారం బిచ్కుంద మున్సిపాలిటీ కార్యాలయం ఆవరణంలో ఏర్పాటు చేసిన మండల న్యాయ సేవా అధికార సంస్థ, బిచ్కుంద న్యాయ విజ్ఞాన సదస్సు కార్యక్రమంలో ఆయన పలు సూచనలు చేశారు. నియోజకవర్గంలో పొగాకు ఉత్పత్తుల నియంత్రణ పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. పొగాకు ఉత్పత్తుల వాడకం వలన కలిగే అనర్థాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థల్లో పొగాకు వాడకం, ధూమపానం వల్ల వచ్చే వ్యాధులపై గొడ పత్రికలు, కర పత్రాలు, ప్రత్యేక సమావేశాలు నిర్వహించి అవగాహన సమావేశాలు నిర్వహించాలని తెలిపారు. పొగాకు వల్ల బీడీ కార్మికులు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉన్న దృష్ట్యా వారికి ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించేలా అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. భారతదేశంలో అమలులో ఉన్న పొగాకు నియంత్రణ చట్టం ప్రకారం బహిరంగ ప్రదేశాలు, కార్యాలయాల్లో పొగత్రాగడం నేరమన్నారు. అలాగే, అన్ని పొగాకు ఉత్పత్తుల ప్రకటనలపై నిషేధ విధించారని తెలిపారు. 18 ఏళ్ల కంటే చిన్న పిల్లలకు వీటిని అమ్మడం నేరమన్నారు. అదేవిధంగా స్కూల్, కళాశాల ఆవరణ నుంచి 100 గజాల దూరం వరకు ఉత్పత్తులను అమ్మడం నేరమని పేర్కొన్నారు. అన్ని పొగాకు ఉత్పత్తులపై చిత్రంతో కూడిన హెచ్చరికను తప్పకుండా ముద్రించాల్సి ఉంటుందన్నారు. ఈ నిబంధనలు అన్ని మండలల్లో తప్పకుండా అమలు చేయాలని సంబంధిత అధికారులను బిచ్కుంద కోర్ట్ న్యాయమూర్తి వినీల్ కుమార్ ఆదేశించారు.
ఈ నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్ట ప్రకారం జరిమానాలు విధించాలన్నారు. ఆయా విషయాలను ప్రజలందరికీ చేరేలా విస్తృత ప్రచారం చేయాలన్నరూ. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సీఐ సత్యనారాయణ,బిచ్కుంద సర్కిల్ ఇన్స్పెక్టర్ జగడం నరేష్, ఎస్సై మోహన్ రెడ్డి, ఎక్సైజ్ ఎస్సై పి నాగేష్, మరియు న్యాయవాదులు బిచ్కుంద బార్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రకాష్, లక్ష్మణ్ రావు, మల్లేశం, మమ్మద్, శివాజీ, రాథోడ్ మనోజ్, బిచ్కుంద మున్సిపాలిటీ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.