జనం న్యూస్ జూన్ 03 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
టైగర్ జోన్ ఏర్పాటును మానుకోవాలని, టైగర్ జోన్ ఏర్పాటు పేరుతో ఆదివాసీ గిరిజనులను ఇబ్బందులకు గురి చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఎమ్మెల్యే కోవలక్ష్మి హెచ్చరించారు.భూ సమస్యల పరిష్కారం కోసం స్థానిక కలెక్టరేట్ కార్యాలయం ఎదుట రాజ్ గోండ్ సేవా సమితి. గోండ్వానా పంచాయతీ రాయి సెంటర్ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలో ఎమ్మెల్యే పాల్గొని వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఆదివాసీ గిరిజనులతోనే అడవుల మనుగడ సాధ్యమని, అటవీ హక్కు పట్టాలు ఉన్న..పోడు సాగు పేరుతో వారిని అటవీ అధికారులు ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు. అటవీ అధికారుల ఇబ్బందుల నేపథ్యంలో ఖరీఫ్ సాగు చేయాల్సిన రైతులు పనులు మానుకుని ఆందోళన చెందాల్సిన వస్తోందని వాపోయారు. కేసీఆర్ హయాంలో 4 లక్షల 50 ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చామని.. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని మిగులు భూములకు పట్టాలు ఇవ్వడంతో పాటు పట్టా ఉన్న వ్యక్తి చనిపోతే వారి కుటుంబ సభ్యులకు పట్టా చేసి ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆదివాసీ సంఘాలతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు.