జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూన్ 4 రిపోర్టర్ సలికినీడి నాగరాజు
మానుకొండవారిపాలెంలో ప్రధాన ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం.. గణపవరంలో తాగునీటి ఫిల్టర్ బెడ్ల ఏర్పాటుకు మార్గం సుగమం : ప్రత్తిపాటి.
మూడుగ్రామాల ప్రజల పోరాటం.. ప్రత్తిపాటి ప్రత్యేక చొరవ.. రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ ఆదేశాలతో నిధులు మంజూరు : ప్రత్తిపాటి కార్యాలయవర్గాలు “ గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో అటు పంచాయతీలుగా మనుగడ సాగించలేక… ఇటు మున్సిపాలిటీపరిధిలో అభివృద్ధికి నోచక ఇబ్బంది పడిన మానుకొండవారిపాలెం, గణపవరం గ్రామాల్లో పలు అభివృద్ధిపనులకు నిధులు మంజూరయ్యాయి. మానుకొండవారిపాలెంలో 40లక్షల లీటర్ల సామర్థ్యంతో ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం, నాదెండ్ల మండలం గణపవరంలో నూతన ఫిల్టర్ బెడ్ల నిర్మాణానికి జడ్పీ నిధులు కేటాయిస్తున్నట్టు జిల్లా పరిషత్ కార్యాలయవర్గాలు ధృవీకరించాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి.. రెండు గ్రామాల్లో మొత్తం రూ.56లక్షలతో ఆయా పనులు ప్రారంభం కానున్నాయి. త్వరలోనే వాటికి సంబంధించిన టెండర్లు ఖరారుచేసి, ప్రభుత్వ నిబంధనలు, మార్గదర్శకాల ప్రకారం పనులు ప్రారంభించడం జరుగుతుంది. చిలకలూరిపేట మున్సిపాలిటీలో విలీనం చేయడం వల్ల మానుకొండవారిపాలెం, గణపవరంతో పాటు పసుమర్రు గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు. గ్రామసమస్యలను శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. గతపాలకులు ఆ మూడు గ్రామాలను ఇష్టానుసారం మున్సిపాలిటీలో విలీనం చేయడంతో అభివృద్ధిలేక.. పంచాయతీలకు ఏ విధమైన నిధులు రాక సమస్యలు ఎక్కువై ప్రజలు ఇబ్బందులు పడిన విషయాన్ని శాసనసభ్యులు అసెంబ్లీ సాక్షిగా కూడా ప్రభుత్వానికి తెలియచేయడం జరిగింది. ఎమ్మెల్యే ప్రత్తిపాటి విజ్ఞప్తిపై, ఇటీవల రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణ తేజ చిలకలూరిపేట వచ్చి, గణపవరం గ్రామాన్ని సందర్శించి, మూడుగ్రామాల ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. మున్సిపాలిటీలో విలీనం వల్ల తమ గ్రామాలకు జరిగిన నష్టాన్ని గ్రామస్తులే స్వయంగా ఆయనకు తెలియచేశారు. వారి బాధలు విని, గ్రామాల్లోని సమస్యలు ప్రత్యక్షంగా చూసిన కృష్ణతేజ ప్రధానమైన తాగునీటి సమస్య పరిష్కారానికి సరిపడా నిధుల్ని జడ్పీ నుంచి కేటాయించాలని జిల్లా పరిషత్ సీ.ఈ.వో జ్యోతిబసును ఆదేశించడం జరిగింది. గ్రామస్తుల సమిష్టిపోరాటం.. కృష్ణతేజ ఆదేశాలతో ఎట్టకేలకు రెండు గ్రామాల్లోని తాగునీటిసమస్య పరిష్కారానికి రూ.56లక్షల జడ్పీ నిధులు మంజూరు చేయడం జరిగింది. నిధుల మంజూరుకు సంబంధించిన సమాచారాన్ని జిల్లా పరిషత్ కార్యాలయ వర్గాలు ధృవీకరించాయి” అని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు కార్యాలయ వర్గాలు బుధవారం ఒకప్రకటనలో తెలియచేశాయి.