ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య
పాఠశాలల్లో చేర్పించాలని ఇంటింటికీ ప్రచారం చేస్తున్న ఉపాధ్యాయులు
జనం న్యూస్ జూన్ 07(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)
బడీడు పిల్లలందరిని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని నర్సింహులగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్ఎం అనురాధ,మండల ప్రాథమిక పాఠశాల హెచ్ఎం శ్రీనివాస్ అన్నారు.శుక్రవారం నర్సింహులగూడెం గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామసభ నిర్వహించి అనంతరం గ్రామంలో ఉపాధ్యాయులతో కలిసి బడిబాట కార్యక్రమం నిర్వహించారు.ప్రభుత్వ బడుల్లో పేద విద్యార్థులకు అన్ని రకాల సదుపాయాలు కల్పించడం జరుగుతుందని గ్రామంలో తిరుగుతూ తల్లిదండ్రులకు వివరించారు.చదువు ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపుతుందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను తప్పనిసరిగా ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని సూచించారు.ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ఫలితాలు సాధిస్తున్నాయని వివరించారు. ప్రభుత్వ బడులను బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.ప్రతి ఒక్కరూ తమ పిల్లలను గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సెక్రటరీ ఉదయ్ కుమార్,రెండు పాఠశాలల ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్ సౌజన్య, పాఠశాల ఏఏపిసి అధ్యక్షులు నస్రీన్,విపికే రేణుక,మహిళా సంఘం అధ్యక్షురాలు మంగతాయమ్మ తదితరులు పాల్గొన్నారు.