జనం న్యూస్ 11 జూన్ భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి)
భీమారం మండలంలోని ఆరేపల్లి ఎక్స్ రోడ్డు, పలు గ్రామాలను కలుపుతున్న ప్రధాన సీసీ రహదారి గత కొన్ని సంవత్సరాలుగా పూర్తిగా నిర్జీవంగా మారింది. దాదాపు 20 సంవత్సరాల క్రితం నిర్మించిన రహదారి కాలక్రమంలో పాడైపోయినా, ఇప్పటివరకు ఒక్కసారి కూడా మరమ్మతులు చేపట్టకపోవడం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది.సీజనుకు సంబంధం లేకుండా ఈ రహదారి దుస్థితి ఒకేలా ఉండిపోతుంది. వర్షాకాలంలో చిన్నపాటి వర్షం పడినా రహదారి గోతులతో నిండిపోతుంది. రోడ్డు మట్టితో, మురుగుతో మిశ్రమమై ప్రయాణికులకు భయానక అనుభూతిని కలిగిస్తోంది. వాహనదారులు, ముఖ్యంగా ఆటో, బైక్ యజమానులు ప్రతిరోజూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్నిసార్లు అధికారులదృష్టికి తీసుకెళ్ళినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు, ఆగ్రామాల ప్రజలు అనేకసార్లు ఫిర్యాదు చేసినా, ఇప్పటివరకు అధికారుల నుంచి ఎటువంటి స్పందన రాలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే మరమత్తులు చేపట్టాలి గ్రామ ప్రజలు కోరుతున్నారు