జనం న్యూస్ జూన్ 11 ముమ్మిడివరం ప్రతినిధి
….42 ఏళ్లకు నెరవేరాబోతున్న కల …..హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్న ఎస్సీ సామాజిక వర్గ నేతలు
అయినవిల్లి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్ష స్థానం ఎస్సీలకు కేటాయిస్తూ జిల్లా నాయకత్వం నిర్ణయించింది. నాలుగు దశాబ్ధాల కాలంగా ఎదురు చూస్తున్న మండల పార్టీ అధ్యక్ష స్థానం ఎస్సీలకు దక్కటం పట్ల ఆ సామాజిక వర్గంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి కారకులైన జిల్లా, నియోజకవర్గ, మండల నాయకత్వానికి ఆ సామాజిక వర్గ నాయకులు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. 42 ఏళ్ల తెలుగుదేశం పార్టీ ప్రస్థానంలో అయినవిల్లి మండల పార్టీ అధ్యక్షుడిగా ఇప్పటివరకు ఎస్సీలకు అవకాశం ఇవ్వలేదు. తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకత్వం లోగల అంతర్గత ప్రజాస్వామ్యానికి ఇది ఉదాహరణగా నిలుస్తుంది. అయినవిల్లి మండలంలో అత్యధికంగా గల సామాజిక వర్గంగా ఎస్సీలలోని మాల సమాజిక వర్గం ఉంది. అలాగే ఓసీ సామాజిక వర్గంలోని కాపు, బీసీ సామాజిక వర్గంలోని శెట్టి బలిజ సామాజిక వర్గాలు అధిక ఓటర్ల జనాభాను కలిగి ఉన్నాయి. అంతేకాకుండా ఈ మూడు సామాజిక వర్గాలలో రాజకీయ సామాజిక చైతన్యం ఎక్కువ. ముఖ్యంగా ఎస్సీ సమాజిక వర్గంలో సామాజిక స్పృహ మరీఎక్కువ. అంతేకాకుండా తమ సామాజిక వర్గ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించే రాజకీయ పార్టీలకు గుణపాఠం నేర్పిన పరిస్థితి ఆ సామాజిక వర్గానికి ఉంది. ఇటువంటి సామాజిక , రాజకీయ నేపథ్యం కలిగిన మాలలకు అన్ని రాజకీయ పార్టీలు తగిన ప్రాధాన్యత ఇస్తూ వచ్చాయి. ఆ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, పి ఆర్ పి, జనసేన వంటి ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు. సిపిఐ, సిపిఎం పార్టీలు సైతం ఎస్సీ నాయకత్వాన్ని ప్రొత్సహాస్తూ వస్తున్నాయి. టిడిపి మాత్రం ఇప్పటివరకు ఎస్సీ సామాజిక వర్గానికి మండల అధ్యక్షుడిగా అవకాశం కల్పించకపోవడం పట్ల ఆయావర్గాల్లో అసంతృప్తి వ్యక్తమౌతుంది. ఈ క్రమంలోనే గత సంస్థాగత ఎన్నికల సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడిగా తమకు అవకాశం ఇవ్వాలని ఎస్సీలు కోరారు. అయితే ఎస్సీల డిమాండ్ కు అన్ని వర్గాల నుంచి మెజారిటీ మద్దతు లభించింది. కానీ ఒక వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు చేయటంతో దళిత సామాజిక వర్గానికి చెందిన నాయకులు నిరసనగా ఎన్నికల నుంచి నిష్క్రమించారు. ఆ సందర్భంగా చర్చలు జరిపారు. పార్టీ జిల్లా నాయకత్వం తదుపరి సంస్థాగత ఎన్నికల సందర్భంగా మండల అధ్యక్ష స్థానాన్ని ఎస్సీలకు కేటాయిస్తామని హామీ ఇవ్వటం జరిగింది. అప్పటి హామీ మేరకు ఈ దఫా సంస్థాగత ఎన్నికల సందర్భంగా అయినవిల్లి మండల అధ్యక్ష స్థానాన్ని ఎస్సీలకు కేటాయిస్తూ నిర్ణయించారు. అలాగే అంబాజీపేట అద్యక్ష స్థానాన్ని శెట్టిబలిజకు మామిడికుదురు మండల అధ్యక్ష స్థానం కాపు సామాజిక వర్గానికి కేటాయిస్తున్నట్లు జిల్లా అధినాయకత్వం ప్రకటించారు. ఈ విధంగా అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం చేస్తూ నిర్ణయం తీసుకుంది. జిల్లా నాయకత్వం నిర్ణయం పట్ల అన్ని సామాజిక వర్గాలలోనూ సంతృప్తి వ్యక్తం అయింది. "ఇది సామాజిక సమతుల్యతను సాధించే కూర్పు " అని పేరు చెప్పటానికి నిరాకరించిన ఒక నాయకుడు వ్యాఖ్యానించారు. ఇలా నాలుగు దశాబ్దాల అనంతరం ఎస్సీ సామాజిక వర్గానికి మండల పార్టీ అధ్యక్ష స్థానం దక్కటం పట్ల ఆ సామాజిక వర్గం ఆనందం వ్యక్తం చేస్తోంది. ఇలా మండల పార్టీ అధ్యక్ష స్థానం దక్కించుకోవాలని కొందరు ఎస్సీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఎన్నిక జరగకుండా ఏకాభిప్రాయంతో ఏకగ్రీవం చేసేందుకు ఆ సామాజిక వర్గ నాయకులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఆశావహులు కూడా అందుకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం.