జనం న్యూస్ జూన్ 30 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయం నందు ఎస్సై దుర్గం రాజయ్య యొక్క పదవి విరమణ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ ఐపిఎస్ సోమవారం ఘనంగా నిర్వహించారు. పదవి విరమణ పొందుతున్న ఎస్సై రాజయ్య ని జిల్లా పోలీస్ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు వీడ్కోలు కార్యక్రమం లో ఎస్పీ శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఎస్ఐ రాజయ్య 1989 లో పోలీసు శాఖలో సివిల్ పోలీసు కానిస్టేబుల్ నియామకమై, గడిచిన 35 సంవత్సరాల సర్వీస్ లో వారికి అప్పగించిన విధులను సక్రమంగా నిర్వహిస్తూ అధికారుల మన్ననలు పొందారని అన్నారు. సర్వీస్ మొత్తంలో ఎలాంటి రిమార్క్ లేకుండా 2012 లో హెడ్ కానిస్టేబుల్, 2017 లో ఏ.ఎస్.ఐ, 2024 సంవత్సరంలో సబ్-ఇన్స్పెక్టర్ గా పదోన్నతి పొందారని అన్నారు. పోలీసు శాఖకు అందించిన సేవలు మరువలేనివని రాజయ్య సేవలను కొనియాడారు. రిటైర్మెంట్ అనంతరం పోలీసు శాఖ నుండి రావలసిన అన్నిరకాల రిటైర్మెంట్ బెన్ఫిట్స్ సకాలంలో అందేవిధంగా చూస్తామన్నారు. రిటైర్మెంట్ అనంతరం ఆయురారోగ్యాలతో ఉండాలని, మిగిలిన శేష జీవితం అతని కుటుంబంతో సంతోషంగా గడపాలని కోరుకుంటున్నాను అన్నారు. మీరు రిటైర్మెంట్ అయినప్పటికీ పోలీసు కుటుంబంలో సభ్యులేనని పోలీస్ శాఖ తరపున మీకు, మీ కుటుంబాలకు ఎల్లవేళలా సహాయ, సహకారం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ సంఘం అధ్యక్షులు విజయ శంకర్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాణాప్రతాప్, ఆర్.ఐ అంజన్న, ఎస్ఐ రాజయ్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.