విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్
జనం న్యూస్ 21 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
చట్టాన్ని తరుచూ ఉల్లంఘిస్తూ, ప్రజాశాంతికి భంగం కలిగిస్తూ, సమాజానికి ప్రమాదకరంగా మారుతూ, భౌతిక
దాడులకు పాల్పడుతూ, పలు కేసుల్లో నిందితుడిగా అరెస్టయిన రాజాం మండలం గురువాం గ్రామానికి చెందిన కుప్పిలి నవీన్ (19సం.లు) అనే వ్యక్తిపై పి.డి.యాక్ట్ ప్రయోగించి, ముందస్తు నేర నియంత్రణ చర్యల్లో భాగంగా అతడిని నిర్భందించి, విశాఖపట్నం కేంద్ర కారాగానికి తరలించామని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ జూలై 19న తెలిపారు. విజయనగరం జిల్లా రాజాం మండలం గురువాం గ్రామంలో నివాసం ఉంటున్న నిందితుడు కుప్పిలి నవీన్ అనే వ్యక్తి చెడు వ్యసనాలకు అలవాటు పడి, ప్రజలతో అహంకారంతో దురుసుగా ప్రవర్తిస్తూ, ఇతరులకు హాని కలిగించే విధంగా చిన్న చిన్న విషయాలకే గొడవలు పడుతూ, భౌతిక దాడులకు పాల్పడుతూ, గత ఐదు సంవత్సరాల్లో విజయనగరం జిల్లా రాజాం పోలీసు స్టేషనులో 4 కేసుల్లోను, సంతకవిటి పోలీసు స్టేషనులో 8 కేసుల్లోను (మొత్తం 12కేసులు) నిందితుడిగా అరెస్టు అయ్యారన్నారు. కుప్పిలి నవీన్ ప్రవర్తన సమాజానికి హానికరంగా మారుతున్న కారణంగా నేరాల నియంత్రణకు జిల్లా పోలీసుశాఖ చేపడుతున్న ముందస్తు చర్యల్లో భాగంగా కుప్పిలి నవీన్ (19 సం.లు)పై పి.డి.యాక్ట్ అమలు చేయాలని కోరుతూ రాజాం పోలీసులు జిల్లా పోలీసు కార్యాలయంకు ప్రతిపాదనలు పంపగా, వాటిని సిఫార్సు
చేస్తూ జిల్లా కలెక్టరు డా. బి.ఆర్. అంబేద్కర్ గార్కి ప్రతిపాదనలు పంపామన్నారు. నిందితుడు కుప్పిలి నవీన్ పై ఇప్పటికే రాజాం పోలీసు స్టేషనులో రౌడీ షీటు ఉందని జిల్లా ఎస్పీ తెలిపారు. రాజాం పోలీసుల ప్రతిపాదనలను జిల్లా కలెక్టరు డా.బి.ఆర్.అంబేద్కరు పరిశీలించి, నిందితుడి ప్రవర్తన సమాజానికి ప్రమాదకరంగా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తిగా మారుతున్నాడని భావించి, నిందితుడు కుప్పిలి నవీన్ ను నిర్భందించి, విశాఖపట్నం సెంట్రల్ జైలుకు తరలించామని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.
శాంతిభద్రతలకు ఎవరైనా విఘాతం కలిగించినా, చైన్ స్నాచింగ్స్, రోబరీ, గంజాయి, మాదక ద్రవ్యాల అక్రమ రవాణకు పాల్పడినా, భూదురాక్రమణలకు పాల్పడినా, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ, సమాజానికి ప్రమాదకరంగా మారితే ఉపేక్షించేది లేదన్నారు. అటువంటి నిందితులను గుర్తించి, వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు చేపట్టడానికి వెనుకాడబోమన్నారు. నిందితుల ప్రవర్తనను ఎవ్పడప్పుడు పరిశీలించి, అటువంటి వ్యక్తులపై షీట్లు ప్రారంభించడం, పి.డి.యాక్టుకు ప్రయోగించడం, నేరాల నియంత్రణకు ముందస్తుగా నిర్భందిస్తామన్నారు. కావున, నిందితులు సత్పప్రవర్తనతో, చట్టాన్ని గౌరవిస్తూ జీవించాలని, నేర ప్రవృత్తిని విడనాడాలన్నారు. నేర చరిత్ర కలిగిన వ్యక్తులపైనా, వివిధ క్రిమినల్ కేసుల్లో అరెస్టుకాబడిన నిందితులపై నిరంతర నిఘా ఉంటుందని, ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ హెచ్చరించారు.