హైదరాబాద్, జనవరి 6: ఫార్ములా-ఈ రేస్ (Formula E racing Case) కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. ఈ కేసుకు సంబంధించి సంచలన విషయాలను తెలంగాణ సర్కార్ (Telangana Govt) బయటపెట్టింది. ఇందులో క్విడ్ ప్రోకో జరిగినట్టుగా ప్రభుత్వం తేల్చింది. బీఆర్ఎస్కు రూ.41 కోట్లను బాండ్ల రూపంలో గ్రీన్ కో సంస్థ ముట్టచెప్పినట్టు వెల్లడించింది ప్రభుత్వం. గ్రీన్ కో కంపెనీ ద్వారా బీఆర్ఎస్ పార్టీకి కోట్ల రూపాయల లబ్ధి చేకూరినట్లు వెల్లడించింది. బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల బాండ్ల రూపంలో రూ.49 కోట్లను గ్రీన్ కో కంపెనీ చెల్లించిందని.. గ్రీన్ కో, దాని అనుబంధ సంస్థలు 41 సార్లు బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల బాండ్ల రూపంలో చందాలు ఇచ్చినట్లు సమాచారం. రేసుకు సంబంధించిన చర్చలు మొదలయినప్పటి నుంచే ఎన్నికల బాండ్లను గ్రీన్ కో సంస్థ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. 2022, 8 ఏప్రిల్ నుంచి అక్టోబర్ 10 మధ్య బాండ్లను కొనుగోలు చేసినట్లు సమాచారం. ప్రతి సారి రూ. కోటి విలువ చేసే బాండ్లు గ్రీన్ కో కంపెనీ కొనుగోలు చేసినట్లు తెలియవచ్చింది. మొత్తం రూ. 49 కోట్లను ఎన్నికల బాండ్ల రూపంలో బీఆర్ఎస్ కు గ్రీన్ కో సంస్థ చెల్లింపులు చేసినట్లు సమాచారం.