
జనం న్యూస్ - నవంబర్ 20- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ -
పర్యాటకులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న నాగార్జునసాగర్ - శ్రీశైలం లాంచీ ప్రయాణం ఈనెల 22 నుండి ప్రారంభం కానుంది. కృష్ణానది ఒడిలో నల్లమల కొండల పచ్చని ప్రకృతి మధ్యన సాగే సాగర్ టు శ్రీశైలం లాంచీ ప్రయాణం కోసం తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈనెల 22 శనివారం నుండి సాగర్ టు శ్రీశైలం లాంచీ ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఉన్నతాధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. నాగార్జునసాగర్ నుండి లాంచీలో శ్రీశైలం వెళ్లే ప్రయాణికులకు వన్ వే పెద్దలకు 2000 రూపాయలు, పిల్లలకు 1600 రూపాయలు( 5 నుండి 10 సంవత్సరంలు), సాగర్ నుండి లాంచీలో శ్రీశైలం వెళ్లి తిరిగి అదే లాంచీలో మరుసటి రోజు సాగర్ రావడానికి పెద్దలకు 3250 రూపాయలు,పిల్లలకు 2600 రూపాయలు గా టికెట్లను కేటాయించారు. లాంచీ ప్రయాణంలో మధ్యాహ్నం భోజనం సౌకర్యం లాంచీలోనే ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈనెల 22 నుండి ప్రతి శనివారము టికెట్ల బుకింగ్ ఆధారంగా సాగర్ టు శ్రీశైలం లాంచీ ప్రయాణాన్ని కొనసాగిస్తామని తెలిపారు. సోమవారం నుండి శుక్రవారం వరకు 100 టికెట్లను బుక్ చేసుకుంటే ప్రత్యేకంగా సాగర్ నుండి శ్రీశైలానికి లాంచీ ప్రయాణాన్ని ఏర్పాటు చేయనున్నట్లుగా వారు తెలిపారు. ఆన్లైన్ టికెట్ల కోసం డబ్ల్యూ డబ్ల్యు డబ్ల్యు టి జి టి డి సి.ఇన్ వెబ్ సైట్లో బుకింగ్ చేసుకోవచ్చని తెలిపారు. మరిన్ని వివరాలకు హైదరాబాద్ లోని బషీర్ బాగ్ సెంట్రల్ రిజర్వేషన్ సెంటర్ - 9848540371, 9848125720 మరియు నాగార్జునసాగర్ లాంచీ యూనిట్ -:7997951023 ఫోన్ నెంబర్లను సంప్రదించాలని తెలిపారు.