
రాష్ట్ర స్థాయిలో బంగారు పతకాలు సాధించిన విజయనగరం 1వ పట్టణ ఎఎస్ఐ ఆల్తి త్రినాధరావు
విశాఖపట్టణం సిటీ వెలమపేటలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి డెడ్ లిఫ్ట్ & బెంచ్ ప్రెస్ ఛాంపియన్ షిప్ పోటీల్లో రెండు బంగారు పతకాలు సాధించిన ఎఎస్ఐను అభినందించిన జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్
జనం న్యూస్ 02 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్:
విజయనగరం 1వ పట్టణ పోలీసు స్టేషన్లో ఎఎస్ఐగా పని చేస్తున్న ఆల్తి త్రినాధరావు ఇటీవల విశాఖపట్టణం వెలమపేట శ్రీ విజయేంద్ర వ్యాయామ మండలిలో "పవర్ లిఫ్టింగ్ ఆఫ్ ఇండియా" వారి ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో రెండు బంగారు పతకాలు పొందినట్లుగా జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ డిసెంబరు 1న తెలిపారు. బంగారు పతకాలు సాధించిన ఎఎస్ఐ ఆల్తి త్రినాధరావు జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్ గార్ని పోలీసు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలవగా, జిల్లా ఎస్పీగారు ఎఎస్ఐ త్రినాధరావును ప్రత్యేకంగా అభినందించి, ఇదే స్పూర్తిని భవిష్యత్తులో కూడా కొనసాగించి, జాతీయ స్థాయిలో మరిన్ని పతకాలు సాధించాలని అభిలాషించారు.విశాఖపట్టణం వెలమ పేటలో నవంబరు 30న జరిగిన రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగు సెలక్షన్స్ కమ్ పవర్ లిఫ్టింగు పోటీలను నిర్వహించగా, ఎఎస్ఐ ఆల్తి త్రినాధరావు క్రీడల పట్ల ఆసక్తితో పోటీల్లో పాల్గొన్నారన్నారు. మాస్టర్స్ విభాగం 60+, 93 కేటగిరిలో ఎఎస్ఐ త్రినాధరావు బెంచ్ ప్రెస్లో 95 కిలోలు, డెడ్ లిఫ్టులో 142.5 కిలోల బరువును ఎత్తి, రెండు విభాగాల్లోను బంగారు పతకాలు సాధించి, స్టేట్ సెలక్షన్స్ కు కూడా ఎంపికయ్యారన్నారు. గతంలో విశాఖపట్నం, గాజువాకలో నిర్వహించిన పవర్ లిఫ్టింగు పోటీల్లో రెండు వతకాలు, కేరళ రాష్ట్రం ఏర్నాకుళంలో జరిగిన పోటీల్లో నాలుగు బంగారు పతకాలు సాధించి, భారతదేశం తరుపున నేపాల్లో జరగనున్న అంతర్జాతీయ పోటీల్లో పాల్గొననున్నారని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తెలిపారు. ఈ పోటీలు డిసెంబరు 29, 2025 నుండి జనవరి 2, 2026 వరకు నేపాల్లో జరగనున్నాయి. ఈ పోటీల్లో కూడా మంచి ప్రతిభ కనబర్చి, అంతర్జాతీయ స్థాయిలో బంగారు పతకాలు సాధించాలని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో విజయనగరం 1వ పట్టణ సిఐ ఆర్.వి.ఆర్.కే.చౌదరి, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.