
బిచ్కుంద జనవరి 3 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలంలోని సిరిసముందర్ గ్రామంలో గ్రామ పంచాయతీ లో గ్రామీణ రైతుల ఆర్థిక స్థిరత్వాన్ని పెంపొందించడం, మట్టి ఆరోగ్యాన్ని పరిరక్షించడం, పర్యావరణ సమతుల్యతను కాపాడడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ (NMNF) పథకం పై రైతులకు అవగాహన కల్పించేందుకు ఈరోజు రైతుల అవగాహన సమావేశం సిరిసముందర్ గ్రామ పంచాయతీ వద్ద నిర్వహించడం జరిగింది.ఈ సమావేశంలో రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని తగ్గించి సహజ వనరుల ఆధారిత వ్యవసాయం చేయడం ద్వారా కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించారు. ముఖ్యంగా సహజ వ్యవసాయ విధానాలు, జీవామృతం మరియు ఘనజీవామృతం తయారీ విధానాలు, దేశీ ఆవుల ప్రాముఖ్యత, మట్టిలో సూక్ష్మజీవుల పాత్ర, పంట వ్యయాలు తగ్గించి లాభాలు పెంచుకునే మార్గాలు వంటి అంశాలపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమానికి మండల వ్యవసాయ అధికారి అమర్ ప్రసాద్ , ఏఈఓ దయానంద్ , గ్రామ సర్పంచ్ బార్ వినోద్ , కృషి సఖీలు, బీఆర్సీ సభ్యులు మరియు గ్రామ రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
