
ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గొడం నగేష్.
జనం న్యూస్ 12డిసెంబర్. కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్.
ఆదివాసీల ఆత్మబంధువులు ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్ బెట్టి ఎలిజిబెత్ దంపతులు అని ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యులు గొడం నగేష్ అన్నారు. ఆదివారం ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్ - బెట్టి ఎలిజిబెత్ దంపతుల 39 వ వర్ధంతి సందర్భంగా జిల్లాలోని జైనూర్ మండలం మార్లవాయి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, ఎస్. పి. నితికా పంత్, సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ- ఉట్నూర్ ప్రాజెక్టు అధికారి యువరాజ్ మర్మాట్, ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు, గిరిజన సంఘాల నాయకులతో కలిసి ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్- బెట్టి ఎలిజిబెత్, కొమురం భీం విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యులు మాట్లాడుతూ హైమన్ డార్ఫ్ బెట్టి ఎలిజిబెత్ దంపతులు ఆదివాసీల ఆత్మబంధువులు అని, మార్లవాయి ఎంతో చారిత్రాత్మక ప్రాంతమని తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఈ ప్రాంతం వారు విద్య, ఉద్యోగ రంగాలలో రాణించాలని, గిరిజనుల అభివృద్ధికి అందరం కలిసికట్టుగా కృషి చేస్తామని తెలిపారు. ఎలాంటి సౌకర్యాలు లేని రోజులలో ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్ బెట్టి ఎలిజిబెత్ దంపతులు ఈ ప్రాంతంలో తిరిగి గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఒకే నివేదిక తయారుచేసి ఈ ప్రాంత అభివృద్ధికి చర్యలు తీసుకున్నారని తెలిపారు.జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్ బెట్టి ఎలిజిబెత్ దంపతులు స్వాతంత్రం రాకముందే ఈ ప్రాంతంలో పర్యటించి గిరిజనులతో మమేకమై ఆదివాసీల చైతన్యం కోసం కృషి చేశారని, హైమన్ మానవ పరిణామ పర్యావరణవేత్త, గొప్ప శాస్త్రవేత్త అని తెలిపారు. ఈ ప్రాంత సమస్యలను గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచానికి తెలియజేశారని, వీరి స్ఫూర్తితో గిరిజనుల అభివృద్ధికి కృషి చేద్దామని తెలిపారు. ఆదివాసీలు విద్య, ఉద్యోగ రంగాలలో రాణించి సమాజానికి మంచి పేరు తీసుకురావాలని తెలిపారు. ప్రభుత్వం హైమన్ డార్ఫ్ బెట్టి ఎలిజిబెత్ దంపతుల పేరిట స్మృతి వనం ఏర్పాటుకు నిధులు మంజూరు చేసిందని తెలిపారు.జిల్లా ఎస్.పి. మాట్లాడుతూ ఆదివాసి ప్రజలకు ఎంతో మేలు చేసిన మహనీయులు హైమన్ డార్ఫ్ దంపతులు అని అన్నారు. మార్లవాయి అనేది ఒక ప్రాంతం మాత్రమే కాదని, ఇది ఒక పవిత్ర స్థలమని, ఆదివాసి సంస్కృతి, సాంప్రదాయాలు చాలా గొప్పవని, వాటిని ముందు తరాలకు అందించవలసిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. ఆదివాసి ప్రజలకు విద్య, వైద్యంతో పాటు అన్ని రంగాలలో అభివృద్ధి కోసం హైమన్ డార్ఫ్ దంపతులు కృషి చేశారని అన్నారు. ఆదివాసి ప్రజలకు అన్ని వేళలా జిల్లా పోలీస్ శాఖ అండగా ఉంటుందని, ఏమైనా సమస్య ఉంటే స్థానిక పోలీస్ స్టేషన్ లో సంప్రదించాలని తెలిపారు.ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు మాట్లాడుతూ రాయి సెంటర్ల ఏర్పాటు, గిరిజనులలో పట్టేళ్ల వ్యవస్థ బలోపేతం చేయడంలో కృషి చేశారని, మార్లవాయి ప్రాంత అభివృద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జైనూర్, ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ లు విశ్వనాధ్, ఇరుకుల్ల మంగ, డి సి సి అధ్యక్షురాలు సుగుణ, ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ శ్యాం నాయక్, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి రమాదేవి, మార్లవాయి సర్పంచ్ కనక ప్రతిభ, రాజ్ గోండ్ సేవా సమితి ప్రతినిధి సిడాం అర్జు, రాయి సెంటర్ జిల్లా మేడి కుర్సింగ మోతిరామ్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
