
జనం న్యూస్ 13 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
రానున్న సంక్రాంతి పండుగను పురస్కరించుకుని విజయనగరం 1వ పట్టణ పరిధిలో చైనీస్ మాంజా (నైలాన్/సింథటిక్ దారం) అమ్మకాలు, నిల్వ, రవాణా మరియు వాడకంపై జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ఆదేశాల మేరకు విజయనగరం 1వ పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ ఆర్.వి.ఆర్.కే.చౌదరి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. పర్యావరణ పరిరక్షణ చట్టం-1986 ప్రకారం దీనిపై పూర్తి నిషేధం ఉందని, ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.ఈ సింథటిక్ దారం ద్విచక్ర వాహనదారుల మెడకు తగిలి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి.గాలిపటాలు ఎగురవేసే క్రమంలో చిన్నారుల వేళ్లు తెగి తీవ్ర రక్తస్రావం అయ్యే ప్రమాదం ఉంది.ఆకాశంలో ఎగిరే పక్షులు, వన్యప్రాణులు ఈ దారంలో చిక్కుకుని విలవిల్లాడి మరణిస్తున్నాయి.ఈ దారం విద్యుత్ తీగలకు తగిలితే విద్యుత్ షాక్ తగిలే అవకాశం ఉంది, ఇది అగ్నిప్రమాదాలకు దారితీస్తుంది.ఇది భూమిలో కలిసిపోని పదార్థం కావడం వల్ల పర్యావరణానికి దీర్ఘకాలిక నష్టం కలిగిస్తుంది."చైనీస్ మాంజా అనేది పండుగ ఆటవస్తువు కాదు, అది ఒక ప్రాణాంతక ఆయుధం. మన ఆనందం ఇతరుల ప్రాణాలకు సంకటంగా మారకూడదు."పిల్లలు కేవలం సాంప్రదాయ నూలు (కాటన్) దారంతో మాత్రమే గాలిపటాలు ఎగురవేసేలా చూడండి.పిల్లలు గాలిపటాలు ఎగురవేసే సమయంలో పెద్దలు పర్యవేక్షించడం ఉత్తమం.మీ పరిసరాల్లో ఎవరైనా చైనీస్ మాంజా అక్రమంగా విక్రయిస్తున్నా లేదా నిల్వ చేసినా వెంటనే డైల్ 100/112 కు లేదా స్థానిక పోలీస్ స్టేషన్కు సమాచారం అందించండి. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.మానవ ప్రాణాలకు ముప్పు కలిగించకుండా, ప్రకృతిని ప్రేమిస్తూ బాధ్యతాయుతంగా సంక్రాంతి పండుగను జరుపుకోవాలని సూచించారు.