
జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ అధ్యక్షతన తొలి విడత సమావేశం
పలు అంశాలపై చర్చించి, సూచనలు చేసిన కమిటీ సభ్యులు, అధికారులు
జనం న్యూస్ 30 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
జిల్లాలోని ఎలక్ట్రానిక్ మీడియా, పత్రికా రంగంలో వివిధ హోదాల్లో పని చేస్తున్న అర్హులైన జర్నలిస్టులు 481మందికి తొలి విడతలో అక్రిడిటేషన్లు మంజూరు చేస్తూ జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ ఆమోదం తెలిపింది. కమిటీ ఛైర్మన్, జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ అధ్యక్షతన కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం ఉదయం కమిటీ సమావేశం జరిగింది. జిల్లా రెవెన్యూ అధికారి పి. సత్తిబాబు, కన్వీనర్ & సమాచార శాఖ ఉప సంచాలకులు కె. సదారావుతో పాటు కమిటీ సభ్యులైన మీడియా ప్రతినిధులు, అధికారులు, ఎం.వి. కూర్మరాజు, గంట్ల శ్రీనుబాబు, కె. రాంబాబు, ఆర్. రామచంద్రరావు, డి. రాణి, ఆర్.వై. నాయుడు, పి. ఈశ్వరరావు, కె. కిరణ్ కుమార్, ఈరోతు ఈశ్వరరావు, బి. సురేశ్, వై. రామకృష్ణ, బి. శ్రీనివాసరావు, ఆర్టీసీ ఆర్ఎం అప్పలనాయుడు, డీఎం&హెచ్వో పి. జగదీశ్వరరావు, అసిస్టెంట్ లేబర్ కమిషనర్ మోహన లక్ష్మి, రైల్వే పీఆర్వో జయరాం పాల్గొన్నారు.జీవో.ఎం.ఎస్. నెం. 84, అందులో పేర్కొన్న నిబంధనలు, జర్నలిస్టుల అర్హతలు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఉమ్మడి విశాఖపట్టణం నగరాన్ని ప్రామాణికంగా తీసుకొని గతంలో వలె పరిమితికి మించ కుండా ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు మరొక రెండు రాష్ట్ర స్థాయి అక్రిడిటేషన్లు ఇవ్వాలని కోరగా పరిశీలించాలని కలెక్టర్ సూచించారు.ఫ్రీలాన్స్ జర్నలిస్టుల అక్రిడిటేష్ల జారీ విషయంలో ఎక్స్ పీరియన్స్ నే ప్రామాణికంగా తీసుకోవాలని, బైలైన్ క్లిప్పింగుల విషయంలో సడలింపు ఇవ్వాలని సభ్యులు కలెక్టర్ దృష్టికి తీసుకు రాగా పరిశీలించి తగిన చర్యలు తీసు కుంటామన్నారు.సర్క్యులేషన్ ఐదు వేలు పైబడిన చిన్న తరహా పత్రికల అర్హతలను క్షుణ్నంగా పరిశీలించాలని కమిటీ అభిప్రాయపడింది.ముందుగా కన్వీనర్ & సమాచార శాఖ ఉప సంచాలకులు కె. సదారావు అజెండా అంశాలను కమిటీకి వివరించారు. దరఖాస్తుల పరిశీలన, ఆమోద ప్రక్రియ, ఇతర అంశాలను తెలిపారు. తొలి విడతలో భాగంగా ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా నుంచి జనవరి 22వ తేదీ వరకు 571 దరఖాస్తులు ఆన్లైన్ ద్వారా అందాయని చెప్పారు. ఇదిలా ఉండగా గురువారం జరిగిన సమావేశంలో 512 ప్రతిపాదించగా.. 481కి కమిటీ ఆమోదం లభించింది. ప్రింట్ మీడియా నుంచి 287, ఎలక్ట్రానిక్ మీడియా నుంచి 194 దరఖాస్తులు అర్హత పొందాయి. వివిధ కారణాల వల్ల 31 దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయి.
ఈ సందర్భంగా జిల్లా కమిటీ ఛైర్మన్, జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అర్హులైన జర్నలిస్టులందరికీ నిబంధనల ప్రకారం అక్రిడిటేషన్లు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయిలో తీసుకోవాల్సిన కొన్ని అంశాలను జర్నలిస్టులు ప్రతిపాదించగా సమాచార శాఖ డైరెక్టర్ దృష్టికి, రాష్ట్ర అక్రిడిటేషన్ కమిటీ దృష్టికి తీసుకెళ్లాలని కన్వీనర్ ను కలెక్టర్ ఆదేశించారు. పూర్తిస్థాయి జర్నలిస్టు కానివారికి అక్రిడిటేషన్ల జారీపై కమిటీ పూర్తిస్థాయి దృష్టి సారించాల్సి ఉందన్నారు. ఉద్యోగులు, లాయర్ లు,టీచర్లు గా పనిచేసే వారు ఉన్నట్లయితే వారి సమాచారం తెలిపితే వారి అక్రెడిటేషన్ నిలుపుదల చేస్తామన్నారు. , పోలీసు కేసులు నమోదై ఉన్న జర్నలిస్టుల విషయంలో నిబంధనల ప్రకారం వ్యవహరించాలని సూచించారు.