
జనం న్యూస్ జనవరి 30 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
సి.ఎస్.ఆర్ ఫండ్స్ ద్వారా సేల్స్ఫోర్స్ సంస్థ వారి సౌజన్యంతో ప్రభాకర్ రెడ్డి నగర్లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భవనాన్ని పూర్తిగా మరమ్మత్తులు చేసి, ఆధునీకరించిన అనంతరం పాఠశాల భవన ప్రారంభోత్సవ కార్యక్రమం మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ చేతుల మీదుగా బూరుగుపల్లి రామ్మోహన్ ఆధ్వర్యంలో ఈరోజు అధికారికంగా ప్రారంభించారు.ఈ భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి బూరుగుపల్లి రామ్మోహన్ ఆహ్వానం మేరకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ప్రారంభోత్సవం అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే లక్ష్యంగా కార్పొరేట్ సంస్థలు ముందుకు రావడం అభినందనీయమని తెలిపారు.విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు అందినప్పుడే నాణ్యమైన విద్య సాధ్యమవుతుందని, ఈ తరహా సి యస్ ఆర్ కార్యక్రమాలు భవిష్యత్ తరాలకు బలమైన పునాదిగా నిలుస్తాయని పేర్కొన్నారు.అదేవిధంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు మాట్లాడుతూ, సేల్స్ఫోర్స్ సంస్థ సి యస్ ఆర్ ఫండ్స్ ద్వారా ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి చేయూతనివ్వడం ప్రశంసనీయమని అన్నారు. పేద మరియు మధ్యతరగతి కుటుంబాల పిల్లలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలకు ఆధునిక సౌకర్యాలు కల్పించడమే నిజమైన సామాజిక సేవ అని పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని ప్రాంతాల్లో జరగాలని ఆకాంక్ష వ్యక్తం చేస్తూ రామ్మోహన్ ని అభినందించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
