
జనం న్యూస్ 02 ఫిబ్రవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన 2026 బడ్జెట్, దేశాన్ని 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మార్చే దిశగా ఉందని విజయనగరం చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రశంసించింది. ఈ బడ్జెట్ పై ఆదివారం చాంబర్ కార్యాలయంలో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా చాంబర్ అధ్యక్షులు కావుగంటి శ్రీనివాస్ మాట్లాడుతూ బడ్జెట్లోని కీలక అంశాలను విశ్లేషించారు: * వైద్య రంగం: క్యాన్సర్ చికిత్సకు వాడే 17 రకాల ఔషధాలపై కస్టమ్స్ డ్యూటీని తొలగించడం ద్వారా సామాన్యులకు వైద్యం చేరువవుతుందన్నారు. * రాష్ట్ర ప్రాధాన్యత: అమరావతి రాజధాని అభివృద్ధికి కేంద్రం ఇస్తున్న సహకారం రాష్ట్రానికి ఎంతో మేలు చేస్తుందని పేర్కొన్నారు. * పారిశ్రామికాభివృద్ధి: ఏం ఎస్ ఏం ఈ రంగం బలోపేతం కోసం 10,000 కోట్ల రూపాయల గ్రోత్ ఫండ్ కేటాయించడం పారిశ్రామిక రంగానికి పెద్ద ఊతమని కొనియాడారు.సమావేశంలో పాల్గొన్న చార్టర్డ్ అకౌంటెంట్ సి.యస్.సి. నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఆదాయపు పన్ను శాఖలో ప్రకటించిన సంస్కరణలు మరియు జి.ఎస్.టి రిటర్న్ ఫైలింగ్ విధానంలో తీసుకొచ్చిన సరళీకరణలు వ్యాపార రంగానికి ఎంతో అనుకూలమని తెలిపారు.యువతకు ఉపాధి, రైతులకు సంక్షేమం, మరియు పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం అందించే విధంగా ఈ బడ్జెట్ ఒక 'బ్లూ ప్రింట్' లా ఉందని చాంబర్ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి బొడ్డు శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు బుడ్డెపు వెంకటరావు, ఆరిశెట్టి శ్రీనివాస్, సహకార్యదర్శులు జి. గోపాలక్రిష్ణ, వల్లంపాటి ఉపేంద్రరావు తదితరులు పాల్గొన్నారు.