
జనం న్యూస్ ఫిబ్రవరి 3 ముమ్మిడివరం ప్రతినిధి
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా భారతీయ జనతా పార్టీ కేంద్ర బడ్జెట్పై జిల్లా ట్రెజరర్ గ్రంధి నానాజీ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ అన్ని రంగాలను సంతృప్తిపరిచే విధంగా రూపొందించబడిందని అన్నారు. కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు. ముఖ్యంగా ఏపీ గ్రామీణ రహదారి ప్రాజెక్టులకు రూ.500.99 కోట్లు, ఏపీ పట్టణ తాగునీరు, మురుగు నీటి పారుదల నిర్వహణకు రూ.800 కోట్లు, ఏపీలో ప్రకృతి వ్యవసాయానికి రూ. 157.32 కోట్లు, రాష్ట్రంలో రహదారులు, వంతెనల పునర్నిర్మాణానికి రూ. 350 కోట్లు కేటాయించడాన్ని ఆయన స్వాగతించారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని అపార ఖనిజ వనరులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర అత్యున్నత అభివృద్ధి కోసం 'రేర్ ఎర్త్ కారిడార్' ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం శుభపరిణామమని పేర్కొన్నారు. దీని ద్వారా రాష్ట్రంలో భారీగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.