
జనం న్యూస్ 05 ఫిబ్రవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
ప్రజల భద్రత, నేరాల నియంత్రణలోను, శాంతిభద్రత పరిరక్షణలోను సిసి కెమెరాల పాత్ర ఎన లేనిదని జిల్లా ఎస్పీ ఏ.ఆర్.దామోదర్, ఐపిఎస్ ఫిబ్రవరి 4న అన్నారు. ప్రజల భద్రతలో సిసి కెమెరాల పాత్రను గుర్తించి, వాటిని ఏర్పాటు చేసేందుకు ప్రజలు స్వచ్చందంగా ముందుకు రావాలని కోరారు.జిల్లా ఎస్పీ ఏ.ఆర్.దామోదర్, ఐపిఎస్ మాట్లాడుతూ - ప్రజల భద్రత, నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ, నేరాలను చేధించుటలోను సిసి కెమెరాలు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. పబ్లిక్ మరియు ప్రైవేటు స్థలాల్లో సిసి కెమెరాలు ఏర్పాటుతో చోరీలు, దొంగతనాలు, ఇతర నేరాలు జరగకుండా నియంత్రించవచ్చునన్నారు. ఒకవేళ నేరం జరిగితే నేరం జరిగిన తీరును సిసి కెమెరాలు రికార్డు చేయడం వలన, ఫుటేజులు పరిశీలించి, వాటి ఆధారంగా కేసుల దర్యాప్తు చేపట్టడం, నేరస్థులను గుర్తించి, ఆయా కేసులను చేధించే అవకాశం ఉంటుందన్నారు. కొన్ని సందర్భాల్లో సిసి ఫుటేజులు ఆధారంగా సాక్ష్యాల సేకరణకు, కార్యాలయాల్లో, వ్యాపార లావాదేవీల్లో పర్యవేక్షణకు సిసి కెమెరాలు ఎంతగానో ఉపయోగ పడతాయన్నారు. పాఠశాలలు, ఆసుపత్రుల్లోను, ముఖ్య కూడళ్ళలోను, వాణిజ్య సముదాయాలు, అపార్టుమెంట్లులో నాణ్యమైన సిసి కెమెరాలను ఏర్పాటు చేయడం వలన ప్రజల భద్రతకు భరోసా లభిస్తుందన్నారు. మత కలహాలను, దొంగతనాలను నియంత్రించుటలో భాగంగా దేవాలయాలు, చర్చిలు, మసీదుల వద్ద కూడా సిసి కెమెరాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. అదే విధంగా దేవతామూర్తులు, దేశ నాయకుల విగ్రహాల భద్రతకు సిసి కెమెరాల పర్యవేక్షణ అవసరమన్నారు.
సిసి కెమెరాల ప్రాధాన్యతను ప్రజలకు, అపార్టుమెంటు వాసులు, ప్రార్ధన మందిరాల యజమానులకు వివరించి, ప్రజల భద్రత దృష్ట్యా స్వచ్ఛందంగా సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకొనే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా ప్రజలకు క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించేందుకు మహిళా పోలీసుల సేవలను వినియోగించుకోవాలని పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. జిల్లాలో నూతనంగా ఇప్పటి వరకు స్ధానికుల సహకారంతో 3500 సిసి కెమెరాలను ఏర్పాటు చేసామని జిల్లా ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ తెలిపారు.సిసి కెమెరాల ఏర్పాటు ప్రక్రియను ఆయా సబ్ డివిజను అధికారులు ప్రతీ రోజూ పర్యవేక్షించాలని విజయనగరం డిఎస్పీ ఆర్.గోవిందరావు, బొబ్బిలి డిఎస్పీ జి. భవ్యరెడ్డి, చీపురుపల్లి డిఎస్పీ ఎస్.రాఘవులును జిల్లా ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ ఆదేశించారు.