
జనం న్యూస్: ఫిబ్రవరి 05 నిడమనూరు నల్లగొండ ప్రతినిధి బొంగరాల శ్రీనివాస్
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 12న జరగబోయే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు కార్మిక వర్గం ప్రజల సిద్ధం కావాలని
కే వి పి స్ జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీను, సీఐటీయూ మండల కన్వీనర్ కోమాండ్ల గుర్వయ్య పిలుపునిచ్చారు.
గురువారం నిడమనూరు మండల కేంద్రంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కరపత్రం ఆవిష్కరించి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక రైతాంగ వ్యతిరేక నిర్ణయాలను వేగంగా అమలు చేస్తుందని విమర్శించారు. ఈ విధానాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా కార్మిక వర్గం రైతాంగం పెద్ద ఎత్తున పోరాడుతుందని అన్నారు. అందులో భాగంగానే ఫిబ్రవరి 12న,10 కేంద్ర కార్మిక సంఘాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ ఫెడరేషన్లు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారని అన్నారు.ఈ సమ్మె నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక అని అన్నారు.కార్మిక వర్గం వందేళ్ళ క్రితం పోరాడి సాధించుకున్న 44 చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్స్ గా మార్చి కార్మిక హక్కులను కాలరాచారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ సంపదను లూటీ చేస్తూ కార్పొరేట్లకు దోచిపెడుతున్న నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలను వెనక్కి కొట్టడం కోసం ఈ పోరాటం చేస్తున్నామని అన్నారు. ఈ సమ్మె జయప్రదం కోసం అన్ని యూనియన్ జనరల్ బాడీ సమావేశాలు సమ్మె నోటీసులు బైక్ ర్యాలీలు సభలు సమావేశాలు విస్తృతంగా నిర్వహించి కార్మిక వర్గంలోకి వెళ్లాలని కోరారు. 140 కోట్ల మంది ప్రజల ప్రయోజనాల కోసం జరుగుతున్న ఈ సార్వత్రిక సమ్మెలో కార్మిక వర్గం ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.ఈ ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు కుంచెం శేఖర్, ఆకారపు నరేష్, సీఐటీయూ నాయకులు కోదండ చరణరాజ్, ముత్యాల కేశవులు, బొడ్డు లింగయ్య, వింజమూరి శివ, గుత్తా శ్రీనివాస్ రెడ్డి,యాదయ్య, నరసింహ, విష్ణు,శ్యామల రాజేష్, వేణు, గణపతి వెంకటయ్య, సైదులు, శ్రీను, శంకర్, ఆవుల కిషన్, తదితరులు పాల్గొన్నారు.