
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు ఫిబ్రవరి 11 సెల్ 9550978955
నరసరావుపేట పట్టణ సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ క్రమంలో రూ.23.60 కోట్ల భారీ నిధులతో పలు కీలక పనులు చేపడుతున్నట్లు బీసీ వెల్ఫేర్ శాసనసభ కమిటీ సభ్యులు, నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు తెలిపారు. పట్టణ ప్రజలకు తాగునీటి కొరత లేకుండా చేయడం ప్రధాన లక్ష్యంగా ఆధునిక సదుపాయాలతో 2 ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు ఆయన పేర్కొన్నారు. నరసరావుపేట పట్టణంలోని రావిపాడు రోడ్డులో గల కాసు బ్రహ్మానంద రెడ్డి పార్క్ ప్రాంగణంలో రూ.10 లక్షల లీటర్ల నీటి నిల్వ సామర్థ్యం గల నూతన ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం, అదే విధంగా పట్టణ నూతన బైపాస్ రోడ్డులోని రిజిస్ట్రార్ కార్యాలయం సమీపంలో 8 లక్షల లీటర్ల సామర్థ్యం గల మరో ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణ పనులు ప్రారంభించ నున్నట్లు వెల్లడించారు. నకరికల్లు చెరువు నుండి శాంతినగర్ ఫిల్టర్ హౌస్ వరకు 11 కిలోమీటర్లు 600 డయామీటర్లు వెడల్పు గల నూతన పైప్ లైన్ ఏర్పాటు, నరసరావుపేట పట్టణంలో తాగునీటి సరఫరాకు నూతన పైప్ లైన్ ఏర్పాటు,పాత పైప్ లైన్లు మరమ్మత్తులు చేయటం జరుగుతుందని తెలిపారు. ఈ రెండు ట్యాంకుల నిర్మాణం పూర్తయితే పట్టణంలో నీటి సరఫరా వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని తెలిపారు. పట్టణ శివారు ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలు గతంలో తాగునీటి కోసం ఇబ్బందులు ఎదుర్కొ న్న విషయాన్ని గుర్తు చేస్తూ, ఈ ప్రాజెక్టులు అమలులోకి వస్తే ఆ శివారు కాలనీ ప్రజల తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. ముఖ్యం గా రెడ్డి నగర్, పోస్టల్ కాలనీ, బైపాస్ రోడ్ పరిసరాలు, వల్లపు చెరువు, సాయి నగర్ వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల ప్రజలకు ఈ పథకాలు ఎంతో ఉపయోగకరంగా మారనున్నాయని అన్నారు. భవిష్యత్తులో పెరుగుతున్న జనాభా అవసరాలను దృష్టిలో పెట్టుకుని తాగునీటి మౌలిక సదుపాయాలను విస్తరించడం అత్యంత అవసరమని ఆయన పేర్కొన్నారు. పట్టణ అభివృద్ధి కేవలం రోడ్లు, భవనాలకే పరిమితం కాకుండా ప్రజల ఆరోగ్యం, పరిశుభ్రత, మౌలిక వసతులు మెరుగుపడేలా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. తాగునీరు ప్రతి కుటుంబానికి సులభంగా అందేలా శాశ్వత ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. ప్రభుత్వ నిధులను పారదర్శకంగా వినియోగిస్తూ, పనులను నిర్దిష్ట గడువులో పూర్తి చేయాలని అధికారు లకు ఆదేశాలు జారీ చేశారు.మంగళవారం నరసరావుపేట తెలుగుదేశం పార్టీ కార్యాల యంలో రూ.23.60 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులు, తాగునీటి ప్రాజెక్టుల పురోగతి తదితర అంశాలపై ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పబ్లిక్ హెల్త్ ఎస్సీ బీ. శ్రీనివాసరావు వారి సిబ్బంది, నరసరావుపేట పురపాలక సంఘ కమిషనర్ రవికుమార్, డీఈ సయ్యద్ రఫీక్, సంబంధిత విభాగాల అధికారులు, సిబ్బంది, టీడీపీ నాయకులు వాసిరెడ్డి రవి తదితరులు పాల్గొన్నారు.