
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు మార్చ్ 12 సెల్ 9550978955
మార్చి 31లోగా అన్ని రకాల పన్నులు చెల్లించండి
మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబు విజ్ఞప్తి
చిలకలూరిపేట:సకాలంలో పన్నులు చెల్లించి పట్టణాభివృద్దికి సహకరించాలని మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబు కోరారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పురపాలక సంఘ పరిధిలో మొత్తం రూ. 10 కోట్లు ఆస్తి పన్ను, రూ. 4కోట్లు నీటి పన్నులు ఉన్నాయని తెలిపారు. ఇందులో ఇప్పటి వరకు ఆస్తి పన్ను రూ. 10 కోట్లలో రూ. 4 కోట్లు మాత్రమే వసూలు అయ్యాయని, నీటి పన్నులో రూ. 4 కోట్లకు గాను కేవలం రూ. ఒక కోటి మాత్రమే వసూలు అయినట్లు వెల్లడించారు. ఆస్తిపన్ను, నీటి పన్నులకు సంబంధించి మొత్తం రూ. 10 కోట్లు బాకాయి ఉందన్నారు. పట్టణ అభివృద్దిలో పన్నుల వసూలు కీలకమని, పన్నులు చెల్లించటం ద్వారానే అభివృద్ది సాధ్యమౌతుందని చెప్పారు. మున్సిపాలిటీ పరిధిలో పారిశుధ్య సిబ్బందికి, ఇతర సిబ్బందికి నెలకు రూ. 85 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. ప్రజలు అర్ధం చేసుకొని పన్నులను మార్చి 31 తేదీ లోగా చెల్లించి తగు రశీదు పొందాలని విజ్ఞప్తి చేశారు. దీంతో పాటు ప్రజలు బాధ్యతతో ట్రేడ్ లైసెన్సు ఫీజు, ఆక్రమణల ఫీజులు ఆన్లైన్ ద్వారా గాని, మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన కౌంటర్లో గాని చెల్లించాలని కోరారు.