
జనం న్యూస్ మార్చి 12: నిజామాబాద్ జిల్లా
ఏర్గటమండల కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గురువారం సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు జిల్లా గౌరవ అధ్యక్షులు ఏ. రమేష్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మిక వర్గం తమ హక్కుల సాధన కోసం సంఘటితంగా పోరాటాలు చేసినప్పుడే సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. గతంలో జరిగిన అనేక ఉద్యమాల్లో మహిళలు ముందుండి పోరాడి విజయాలు సాధించారని పేర్కొన్నారు. మహిళల చైతన్యం మూలంగానే అనేక ఉద్యమాలు విజయవంతమయ్యాయని తెలిపారు. ఐక్య పోరాటాల ద్వారానే కార్మికులు తమ హక్కులను సాధించుకోవచ్చని ఆయన అన్నారు.మహిళలు కుటుంబం నుండి సమాజ అభివృద్ధి వరకు కీలక పాత్ర పోషిస్తున్నారని, మహిళల చైతన్యంతోనే సమాజం ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. అనంతరం అనేక సంవత్సరాలుగా అంగన్వాడీ ఉద్యమంలో సేవలు అందిస్తున్న అంగన్వాడీ ఉద్యోగులను మెమెంటోలు అందజేసి సన్మానించారు.ఈ కార్యక్రమానికి అంగన్వాడీ జిల్లా అధ్యక్షురాలు కె. దేవగంగు అధ్యక్షత వహించి మాట్లాడుతూ సమాజంలో మహిళల పాత్ర ఎంతో కీలకమని, మహిళలకు సమానత్వం మరియు గౌరవం కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు.ఈ కార్యక్రమంలో సన్మాన గ్రహీతలు పద్మ, శారదలతో పాటు జ్యోతి, చంద్రకళ, యమునా, సునీత తదితరులు పాల్గొన్నారు.