
కార్యక్రమంలో పాల్గొన్న ఎం ఈ ఓ గజ్జల కనుకరాజ్""
(జనం న్యూస్ చంటి మార్చ్ 13)సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలోని లింగరాజుపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాలలో ఈరోజు స్వయం పరిపాలన దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఒకరోజు పాటు ఉపాధ్యాయులుగా, అధికారులుగా బాధ్యతలు చేపట్టి పాఠశాల నిర్వహణలో పాల్గొన్నారు.కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు వి. శ్రీకాంత్ మాట్లాడుతూ విద్యార్థులు చదువులో కృషి చేసి భవిష్యత్తులో విద్యారంగం, వైద్యరంగం, పోలీసు శాఖ వంటి వివిధ రంగాల్లో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకొని కష్టపడి చదివితే జీవితంలో శిఖరాలను అధిరోహించగలరని ఆయన సూచించారు.స్వయం పరిపాలన కార్యక్రమంలో భాగంగా డీఈవోగా ప్రియా, హెడ్ మాస్టర్గా వంశిక, ఉపాధ్యాయులుగా పి. వైష్ణవి, పి. చార్వి, పి. అభిషేక్ బాధ్యతలు నిర్వర్తించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని పాఠాలు బోధిస్తూ పాఠశాల నిర్వహణలో తమ ప్రతిభను ప్రదర్శించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వినయ్తో పాటు ఇతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.