
జనం న్యూస్ 14 మార్చి వికారాబాద్ జిల్లా
జిల్లాలో మార్చి 14 నుండి ఏప్రిల్ 16 వరకు నిర్వహించబడనున్న పదో తరగతి (SSC) పబ్లిక్ పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ తరఫున కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా, IPS తెలిపారు. పరీక్షలు జరిగే రోజుల్లో ఉదయం 8:30 గంటల నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు జిల్లాలోని మొత్తం 69 పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో సెక్షన్ 163 BNSS (పాత సెక్షన్ 144 సిఆర్పిసి ) అమలులో ఉంటుందని ఎస్పీ వెల్లడించారు. ఈ ఉత్తర్వుల ప్రకారం పరీక్షా కేంద్రాల చుట్టూ 200 మీటర్ల పరిధిలో ఐదుగురికి మించి గుంపులుగా చేరడం నిషేధం. అలాగే పరీక్షా కేంద్రాల సమీపంలో ఎలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు లేదా మైకులు, డిజేలతో ఊరేగింపులు నిర్వహించరాదని స్పష్టం చేశారు. పరీక్షల సమయంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు కేంద్రాల సమీపంలోని ఇంటర్నెట్ సెంటర్లు, జిరాక్స్ షాపులు మరియు స్టేషనరీ దుకాణాలను తప్పనిసరిగా మూసివేయాలని సంబంధిత యజమానులకు సూచనలు జారీ చేసినట్లు తెలిపారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు ప్రతి పరీక్షా కేంద్రం వద్ద పోలీస్ అధికారులు మరియు సిబ్బందితో ప్రత్యేక బందోబస్త్ ఏర్పాటు చేయబడుతుందని, కేంద్రాల వద్ద అనుమానాస్పద వ్యక్తులపై నిఘా ఉంచుతామని ఎస్పీ తెలిపారు. పరీక్షా కేంద్రాలలోకి మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్లు, బ్లూటూత్ పరికరాలు, నిషేధిత వస్తువులు తీసుకురావడానికి అనుమతి ఉండదని స్పష్టం చేశారు. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పరీక్షలు రాసే విద్యార్థులందరూ ప్రశాంతంగా, ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి విజయవంతంగా ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షిస్తూ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, IPS విద్యార్థులకు “ఆల్ ది బెస్ట్” తెలిపారు.