
జనం న్యూస్ మార్చి 16 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో సోమవారం కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలోని కెపిహెచ్బి ఎం.ఆర్.ఓ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు చేపట్టిన ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ప్రజా సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అనేక హామీలు ఇచ్చినా, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిలో చాలా వరకు అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ ధర్నా కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎంతో కాలం గడిచినా ప్రజలకు స్పష్టమైన ఫలితాలు కనిపించడం లేదన్నారు. ఇంకా మిగిలి ఉన్న 999 రోజులను ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకుండా కాలక్షేపం చేయకుండా, వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకపోతే భవిష్యత్తులో మరింత తీవ్ర స్థాయిలో ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.ప్రజల సమస్యల పరిష్కారం కోసం బీజేపీ చేపట్టిన ఈ పోరాటంలో నిజామాబాద్ జిల్లా ఇంచార్జ్ మాధవరం కాంతారావు, కూకట్పల్లి అసెంబ్లీ కన్వీనర్ శ్రీకర్ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి యాంజల పద్మయ్య, కెపిహెచ్బి కంటెస్టెడ్ కార్పొరేటర్ ప్రీతం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే నియోజకవర్గంలోని డివిజన్ అధ్యక్షులు, కంటెస్టెడ్ కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
